రెండు నెలల కాలంలో విశాఖలో జరిగిన వరుస రసాయన ప్రమాదాలు మరచిపోక మునుపే మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. స్థానిక విమానాశ్రయానికి సమీపంలో ఉన్న షీలానగర్ కంటైనర్ యార్డులో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో సమీపంలోని ఎల్లపువాని పాలెం ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
యార్డులోని హానికర రసాయనాల ద్వారానే ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సర్వీస్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సర్వీస్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదం జరుగుతున్న సమీప ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన, సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం, రాంకీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. ఇలా వరుస ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం గేట్ వే కంటైనర్లో మరో భారీ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. విశాఖకు రాజధాని తీసుకెళ్లాలన్న ప్రభుత్వం ప్రయత్నాలకు ఇలా వరుస ప్రమాదాలు షాక్ ఇస్తున్నాయి.
👉#Vizag కంటైనర్ కార్పొరేషన్ యార్డ్ లో అగ్నిప్రమాదం..
👉రసాయనాలు వున్న కంటైనర్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో ఉలిక్కిపడ్డ ఎల్లపువానిపాలెం ప్రాంత ప్రజలు
👉మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక యంత్రాలు.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పిన అధికారులు
#TDP #YSRCP #Janasena pic.twitter.com/SvnWeXNWp2
— TeluguBulletin.com (@TeluguBulletin) July 27, 2020