Chiranjeevi: స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకల సందర్భంగా హైద్రాబాద్లో ఓ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అన్నీ తానే అయి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమం తరహాలోనే.. ఆ మాటకొస్తే, అంతకు మించి అనే స్థాయిలో హైద్రాబాద్లో ఎన్టీయార్ శత జయంతి కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు.
నేడే ఈ కార్యక్రమం జరగనుంది. టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ కార్య్రక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్య అతిథులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా పంపారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతారని అంతా అనుకున్నారు.
అయితే, అనూహ్యంగా ఎన్టీయార్, ఆ ఆహ్వానాన్ని మన్నించలేకపోయారట. నేడు యంగ్ టైగర్ ఎన్టీయార్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ప్యామిలీతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలున్నాయి ఆయనకి. అందుకే, ఎన్టీయార్ శత జయంతి కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు నిర్వాహకులకు తెలిపాడట జూనియర్ ఎన్టీయార్.
మరోపక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ నటులకు ప్రత్యేక ఆహ్వానాలు అందగా, అందులో ఎంతమంది ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నదానిపై స్పష్టత లేదు.
అయితే, మెగాస్టార్ చిరంజీవికిగానీ.. అలాగే మోహన్బాబుకిగానీ.. ఈ కార్యక్రమం కోసం ఆహ్వానాలు వెళ్ళలేదన్నది సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న ఓ ప్రచారం. అలా ఎందుకు జరిగింది.? నిర్వాహకులు చిరంజీవిని ఎందుకు విస్మరించినట్లు.? మోహన్బాబుని ఎందుకు లైట్ తీసుకున్నట్టు.?
పోనీ, నందమూరి బాలకృష్ణ అయినా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి కదా.?
అయినా పరిశ్రమ లో పిల్లల్ని పిలిచి.. ఎన్టీయార్ తర్వాత పరిశ్రమ పెద్దగా అందరూ అనుకునే చిరంజీవిని పిలవక పోవడం వింతగా ఉంది..