Maldives: ఇటివల భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. మాల్దీవులకు (Maldives) చెందిన పలువురు మంత్రులు ఆయన పర్యటనపై, భారతదేశంపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కలకలం రేపింది. దీనిపై భారత్ తోపాటు అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. వివాదానికి కారణమైన సంబంధిత మంత్రులను పదవుల నుంచి తొలగించినట్టు మాల్దీవుల విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే.. పేర్లు వెల్లడించకపోయినా స్థానిక మీడియా ప్రకారం హాసన్ జిహాన్, షియునా, మాల్షాలను పదవుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. భారత్ పై మంత్రులు వ్యాఖ్యలు చేయడం వారి వ్యక్తిగతమని.. ప్రభుత్వంతో సంబంధం లేదని ఓ ప్రకటనలో తెలిపింది. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని పేర్కొంది. భారత్ నుంచి మాల్దీవులకు పర్యాటకంగా భారీ ఆదాయం సమకూరుతోంది. అనేకమంది సెలబ్రిటీలు మాల్దీవులకు వెళ్తూంటారు. మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో #BanMaldives హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.