Janasena-Tdp: ‘టీడీపీతో పొత్తు ధర్మం పాటించండి.. టీడీపీతో పొత్తు గురించి ఎవరు నెగటివ్ గా మాట్లాడినా కోవర్టులుగా పరిగణిస్తాం.. ముఖ్యమంత్రి అభ్యర్ధి గురించి నాకు వదిలేయండి.. ఎవరూ మాట్లాడొద్దు.. టీడీపీ రెచ్చగొట్టినా సంయమనం పాటించండి..’ ఇవీ జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తమ నేతలు, జనసైనికులు, వీరమహిళలకు ఇచ్చిన సందేశం. అయితే.. గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్నదేంటీ.. అంటే ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు. అయితే.. అధినాయకత్వాలు కలిసి ఉండటంతో అంతా సాఫీగానే సాగిపోతోంది. పైగా.. ఇటివలే టీడీపీ (Tdp) సొంత కార్యక్రమం.. లోకేశ్ (Lokesh) పాదయాత్ర ముగింపు సభలో కూడా పవన్ పాల్గొన్నారు. జనసేన శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అయితే.. చిక్కంతా పొత్తు ధర్మం పాటించండి అని పవన్ ఇచ్చిన పిలుపును టీడీపీ కూడా పాటిస్తుందా అనేదే..? జగన్ ను సీఎం పదవి నుంచి దించాలి.. వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వను అని పవన్ కల్యాణ్ ఎప్పుడూ అంటున్నారు. అంటే జనసేన-టీడీపీ పొత్తు ప్రజల్లోకి వెళ్లాలి.. ఇరు పార్టీల అభిమానుల్ని మెప్పించాలి.. ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అప్పుడే కూటమిలో ఎక్కడ తమ అభ్యర్ధుల్ని నిలబెట్టినా ఓట్లు పడేది. అయితే.. నిన్నటి ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబే. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదు’ అని కుండబద్దలు కొట్టారు. దీంతో జనసైనికులు, రాజకీయ వర్గాలు, ఓరకంగా జనసేన కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టే.
సీఎం షేరింగ్ పై ఎంతో ఆచితూచి మాట్లాడాల్సిన చినబాబు ఒక్కసారిగా మనసులో ఉన్నది బయటపెట్టారు. ఎన్నికల తర్వాత మాట్లాడాల్సిన అంశం.. అధినాయకత్వం చర్చిస్తుంది.. అని అనకుండా చంద్రబాబే సీఎం అంటే జనసైనికులకు, పవన్ మద్దతుదారులను ఇరుకనపెట్టినట్టే. ఓపక్క జనసేన బలం ఉపయోగపడాలని, పవన్ సీఎం కావాలనేది.. వారి ఆకాంక్ష. అసలంటూ పొత్తు పొడిచింది.. ఓట్లు పడేలా చేయాల్సిన సమయంలో లోకేశ్ వ్యాఖ్యలు ఇరుపార్టీలకూ నష్టమే. 2014లో పొత్తు 2018లో లేదు. ఇప్పుడు మళ్లీ జతకట్టి.. ప్రజల్లో నమ్మకం కల్పించాల్సింది పోయి ఇలా మాట్లాడితే.. జనసేన నేతలు సరే, పవన్ సీఎం అనే జనసైనికుల పరిస్థితి, పొత్తు ధర్మం మాటేమిటో..!