ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే తమది సంక్షేమ ప్రభుత్వమని చెబుతున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ, అభివృద్ధి అనే ఊసు లేకుండా, కేవలం సంక్షేమం చుట్టూనే రాజకీయం నడుస్తోంది. వందల కోట్లు, వేల కోట్లు కాదు, లక్షల కోట్లు సంక్షేమం మీద గుమ్మరించేస్తున్నారు.
అప్పులు, అప్పుల మీద అప్పులు, ఆపై ఇంకా ఇంకా అప్పులు.. పొద్దున్న లేస్తే అప్పుల మీదనే రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాధించాల్సిన పరిస్థితి. కొత్త అప్పుల కోసం పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి చేయడం, ప్రత్యేక అనుమతులు పొందడం.. ఇలా నడుస్తోంది గడచిన మూడేళ్ళుగా. ఓ మధ్యతరగతి మనిషి కావొచ్చు, ఆపై కాస్త ఆర్థిక స్థోమత వున్న వ్యక్తి కావొచ్చు, బాగా డబ్బున్న వ్యక్తి కావొచ్చు.. అను నిత్యం అప్పులు చేసుకుంటూ పోతే, ఆయన కుటుంబం ఏమైపోతుంది.? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా అంతే.
‘మేమేమీ వృధా చేయడంలేదు.. అస్సలు అవినీతికి తావు లేకుండా, సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజల్లోకి డబ్బుల్ని పంపిస్తున్నాం.. లబ్దిదారులకే డబ్బులు చేరేలా చేస్తున్నాం..’ అని వైసీపీ చెబుతోంది. పోనీ, ఇదంతా నిజమేనని అనుకుందాం. జనం చేతుల్లోకి వెళుతున్న ఆ సొమ్ములు ఏమవుతున్నాయ్.? తిరిగి ప్రభుత్వ ఖజానానికి జమ కావాలి కదా.? అవుతోందా.? లేదా.?
మద్యం అమ్మకాల రూపంలోనో, ఇతరత్రా పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకి సొమ్ములు జమ అవుతున్నమాట వాస్తవం. అయినాగానీ, కొత్తగా అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోంది.? అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బు సరిగ్గా రొటేషన్ జరగడంలేదన్నమాట. ఆ డబ్బు పక్కదారి పడుతోందన్నమాట. ఇసుకాసురులున్నారు, మట్టిని మింగేసే మారీచులున్నారు.. చెప్పుకుంటూ పోతే, జనాన్ని పీల్చి పిప్పి చేయడానికి ఎక్కడికకక్కడ ‘రాజకీయ రాక్షసులు’ వున్నారు.
అద్గదీ అసలు సంగతి. జనం జేబుల్లోకి వెళుతున్న సొమ్ముల్లో చాలా భాగం, ఈ రాజకీయ రాక్షసుల వద్దకు వెళ్ళిపోతోందన్నమాట. అవన్నీ, పొరుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలోనో, ఇంకో రంగంలోనో పెట్టుబడులుగా పెట్టి, మరింత ఎత్తుకు ఆ రాజకీయ రాక్షసులు ఎదుగుతున్నారన్నమాట.
మొత్తమ్మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న అప్పులు, వేరే రాష్ట్రాల్లోకి పెట్టుబడుల రూపంలోకి వెళ్ళిపోతున్నాయనే అనుకోవాలేమో.! ఇలాగైతే, రాష్ట్రమెలా అభివృద్ధి చెందుతుంది.? అదికార పార్టీకి చెందిన నాయకులే, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న దరిమిలా, రాజకీయ రాక్షసత్వం ఎవరిది.? అన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికీ ఓ ఐడియా వచ్చేస్తోంది.