ఏదీ ఇదివరకటిలా వుండదు.! పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రోళ్ళని విమర్శిచేందుకు ఆస్కారం ఇకపై కేసీయార్కి వుండకపోవచ్చు. ఎందుకంటే, ఆయనిప్పుడు ‘దేశ్ కా నేత’.! అంతేనా, నాగార్జున సాగర్ అలాగే శ్రీశైలం ప్రాజెక్టుల విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ లేవనెత్తే అభ్యంతరాల పట్ల అత్యంత వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా మాట్లాడాల్సి వుంటుంది.
తెలంగాణ సెంటిమెంటుని అస్సలే కోణంలోనూ కేసీయార్ ప్రస్తావించకూడని పరిస్థితులు ముందు ముందు రాబోతున్నాయ్. దేశ్ కా నేత.. అంటే అదే కదా.! దేశంలో అన్ని రాష్ట్రాల్నీ కేసీయార్ సమానంగా చూడాలి. ‘నా తెలంగాణ..’ అనడానికి వీల్లేదు. ‘నా భారతదేశం’ అని తీరాల్సిందే.
పొరుగు రాష్ట్రాల విషయానికొస్తే, మహారాష్ట్ర అలాగే కర్నాటక రాష్ట్రాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్కి పంచాయితీ లేదు. ఛత్తీస్ఘడ్ విషయంలో అయినా అంతే. ఏదన్నా పంచాయితీ వుంటే, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనే.. చాలా అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే కేసీయార్.
భారత్ రాష్ట్ర సమితి.. కేసీయార్ కొత్త పార్టీ పేరు ఇది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ‘తెలంగాణ’ ఔట్ అయిపోయి, ఆ స్థానంలో ‘భారత్’ వచ్చి చేరింది. తెలుగు తల్లి.. ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన పార్టీ, ఇప్పుడు ఆ తెలుగు తల్లినీ గౌరవించక తప్పదు.
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలంతా, ‘దేశ్ కీ నేతా’ అంటూ కేసీయార్ మీద ప్రశంసలు గుప్పించడమొక్కటే కాదు, ఆయన్ని దేశ నాయకుడ్ని చేసి.. దేశంలోని అన్ని రాష్ట్రాల్నీ సమానంగా గౌరవించడమూ నేర్చుకోవాలి. ప్రధానంగా, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు గౌరవించాలి.
ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటే.!