Jr NTR: మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మనవడు జూనియర్ ఎన్టీఆర్ ని ఇరకాటంలో పడేశాయి. ఈనెల 20న కేపీహెచ్ బీ వేదికగా సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ వేడుకలకు రావాల్సిందిగా తారక్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు అందాయి. అదే రోజున తారక్ పుట్టినరోజు ఉండటంతో ఆయన ఇప్పటికీ తన షెడ్యూల్ ప్లాన్ చేసేసుకున్నారు. తన పుట్టినరోజు నాడు కుటుంబంతో గడిపేందుకు మాల్దీవ్స్ కి వెళ్లనున్నట్లు సమాచారం. జయంతి వేడుకలకు తనని ఆహ్వానించిన టీజీ జనార్ధన్, నందమూరి రామకృష్ణ లకు ఈ విషయాన్ని తారక్ చెప్పారని కొన్ని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీన్ని అదునుగా తీసుకున్న తారక్ వ్యతిరేకవర్గం.. ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. తాత మీద తారక్ కి ఉన్న గౌరవాన్ని గురించి పదేపదే ప్రశ్నిస్తోంది. నందమూరి,నారా కుటుంబాలు ఎన్టీఆర్ ని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా..తానే దూరంగా జరుగుతున్నాడని ప్రచారం చేస్తోంది. తాత కోసం ఎన్టీఆర్ ఏం చేశాడని ప్రశ్నిస్తోంది. మరోవైపు కుటుంబ రాజకీయాల్లోకి తనని లాగుతోంది. తన ఇంటి మనుషుల్లా భావించే వల్లభనేని వంశీ, కొడాలి నాని తెలుగుదేశం పార్టీపై అన్ని విమర్శలు గుప్పిస్తున్నా..ఎన్టీఆర్ ఎందుకు వారిని వారించడం లేదని నిలదీస్తోంది.
తారక్ సన్నిహితులు ఏం చెబుతున్నారు?
నందమూరి, నారా కుటుంబీకులకు ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే గుర్తొచ్చారా?. తాత మీద తనకున్న ప్రేమను ఇదివరకు ఎన్నోసార్లు బయటపెట్టారు. ఇప్పటికి ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది ఏముంటుంది?. ఆయనకు అవకాశం వ(ఇ)స్తే కదా ఏం చేయగలడో తెలిసేది. అయినా, చేతినిండా సినిమాలతో జూనియర్ ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించాల్సిన పనేలేదు. ఆయన అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండుంటే వల్లభనేని వంశీ, కొడాలినాని కి కౌంటర్ ఇచ్చేవారేమో. రాజకీయాల్లో ఆయన జోక్యం లేనప్పుడు వీళ్ళిద్దరిని జూనియర్ వారించాల్సిన అవసరమేముంది. తన ఇంటి ఆడపడుచుకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అవమానం జరిగినప్పుడు స్పందించలేదా?. ‘అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం అరాచక పాలనకు దారితీస్తుంది’ అని గడ్డి పెట్టలేదా? తనకి కుటుంబం పట్ల బాధ్యత ఉండబట్టే కదా అలా స్పందించారు. ఇప్పుడు ఈ జయంతి వేడుకలకు తారక్ హాజరు కాలేకపోతే.. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకి అని, తాత మీద అభిమానం లేదని ముద్రవేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా ఈ జయంతి వేడుకలు మాత్రం తారక్ ని ఆలోచనలో పడేశాయి. ఆహ్వానం మేరకు వేడుకలకు హాజరు కాకపోతే కుటుంబానికి తారక్ కి మధ్య దూరం మరింత పెరిగిందనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఈ వేడుకలకు రప్పించడం తెలుగుదేశం పార్టీకి ఎంతో ముఖ్యం. చివరిసారిగా 2009 ఎన్నికల్లో తారక్ ప్రచారం చేశారు అప్పుడు ఆయన ప్రమాదానికి గురి కావడంతో గత రెండు దఫాలుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. తెలుగుదేశం పార్టీ మనుగడకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్న నేపథ్యంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా లేదా అనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఆత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారా లేదా కుటుంబ బాధ్యతలకు లోబడి తాత జయంతి వేడుకలకు హాజరవుతారా అనేది తెలియాల్సి ఉంది.