ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టేశారు. నిజానికి, ఎన్నికలకు ముందరే ఈ ఆపరేషన్ మొదలైంది. టీడీపీ నుంచి టిక్కెట్లు దక్కించుకున్నవారు కూడా ‘మాకు టిక్కెట్ వద్దు బాబోయ్..’ అంటూ వైసీపీలోకి జంప్ చేసేసిన విషయం విదితమే. ఎన్నికలయ్యాక టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు.
ఈ మధ్యలో చాలా జరిగాయి. ఫలితాలు రాకముందే పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీతో టచ్లోకి వెళ్ళారు. అలా వైసీపీతో టచ్లోకి వెళ్ళిన టీడీపీ నేతల లిస్ట్ చాలా పెద్దదే వుందట. అందులో తాజా ఎమ్మెల్యేలు కూడా వున్నట్లు తెలుస్తోంది. లెక్క పక్కాగా తన వద్ద వుంది గనుక, వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా అధికార తెలుగుదేశం పార్టీకి ‘వార్నింగ్’ కూడా ఇచ్చారు. ‘మేం గనుక, పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తే పరిస్థితి ఎలా వుంటుందో తెలుసా.?’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబుని జగన్ హెచ్చరించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.
గతంలో వైసీపీ బాధిత పార్టీ గనుక, ఇప్పుడు బాధ పెట్టే పార్టీగా మారడం తప్పేమీ లేదని కొందరు అనొచ్చుగాక. కానీ, ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ కొన్ని పద్ధతులున్నాయి. చెత్త పని చేసినందుకే చంద్రబాబుని అధికారంలోంచి పీకేసి, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రజలు. అదే అహంకారం ఇప్పుడు వైఎస్ జగన్లో కన్పిస్తోంది. అధికారంలో చేతిలో వుంది కదా.. అని జగన్, అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్న తీరు ఏమాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. యువకుడు, పైగా బంపర్ మెజార్టీతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాల్సింది పోయి, ప్రతిపక్ష నేతపై బెదిరింపులకు దిగడం హాస్యాస్పదం అన్నది రాజకీయ పండితుల అభిప్రాయం.
అయితే, ఇప్పుడు రాజకీయాలు అంత నీతివంతంగా వుండాలని ఆశించడం అత్యాశే అవుతుంది. తమతో చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో వున్నారని వైఎస్ జగన్ చెబితే, ’11 మంది తప్ప, టీడీపీలో మిగతా ఎమ్మెల్యేలంతా మా వెంట వచ్చేస్తారు..’ అని వైసీపీకి చెందిన ఓ ముఖ్య నేత టీవీ చర్చా కార్యక్రమాల్లో ప్రకటించడం గమనార్హం. అంటే, టీడీపీకి చంద్రబాబుని మినహాయిస్తే 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగలబోతున్నారన్నమాట. అదీ అతి కొద్ది రోజుల్లోనే. వైసీపీ వైపు వచ్చే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్ళాలన్నది వైఎస్ జగన్ వ్యూహంగా కన్పిస్తోంది. అదే జరిగితే, ఇప్పుడున్న ‘ఫ్యాన్’ వేవ్లో తెలుగుదేశం పార్టీ ఇంకా సర్వనాశనమవుతుందని వైఎస్ జగన్ భావిస్తున్నారని అనుకోవచ్చు.