ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైసీపీ చెబుతున్న విశాఖ నుంచే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వైసీపీ సర్కారు మీద తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ – బీజేపీ తెరవెనుకాల దోస్తీ బహిరంగ రహస్యమే. కానీ, సీన్ మారింది.!
నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నేడు, బీజేపీ సీనియర్ నేత.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ సర్కారుపై ఘాటైన విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి 2024 ఎన్నికల్లో 20 లోక్ సభ సీట్లు గెలవాలంటూ పార్టీ శ్రేణులకు బీజేపీ సీనియర్ నేత అమిత్ షా పిలుపునివ్వడం గమనార్హం. గడచిన తొమ్మిదేళ్ళలో రాష్ట్రానికి పెద్దయెత్తున కేంద్రం నిధులు ఇచ్చిందన్న అమిత్ షా, వైసీపీ పాలనలో అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు.
రైతుల ఆత్మహత్యలకు సంబంధించి దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో వుందన్న అమిత్ షా, రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిగ్గు పడాలంటూ ఎద్దేవా చేశారు.
కాగా, అమిత్ షా ప్రసంగానికి తెలుగులో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తర్జుమా చేసేందుకు నానా తంటాలూ పడ్డారు. వైసీపీ సానుభూతిపరుడిగా జీవీఎల్ నరసింహారావుకి గుర్తింపు వుంది. వైసీపీని అమిత్ షా విమర్శించడాన్ని జీవీఎల్ జీర్ణించుకోలేకపోయారు. ఆ విమర్శల్ని డైల్యూట్ చేసేందుకు ప్రయత్నించారు.. అనువాదంలో.
ఈ క్రమంలో అమిత్ షా ఒకింత అసహనానికి గురయ్యారు.. దాంతో, ‘సరిగ్గా వినిపించలేదు’ అంటూ జీవీఎల్ కవరింగ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
జేపీ నడ్డా చేసిన విమర్శల్ని, ‘చంద్రబాబు స్క్రిప్టు’గా అభివర్ణించిన వైసీపీ, ఇప్పుడు అమిత్ షా తమ మీద చేసిన విమర్శలపై ఎలా స్పందిస్తుందో ఏమో.!