మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నెలల వయసున్న చిన్నారి నుంచి, కాటికి కాలు చాపిన వృద్ధురాలి వరకు.. ఎవర్నీ మృగాళ్ళు వదిలిపెట్టడంలేదు. ఎందుకీ పరిస్థితి.? ఇది ఓ రాష్ట్రానికి పరిమితమైన సమస్య కాదు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి.
నిర్భయ పేరుతో చట్టం వచ్చింది.. దిశ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు జరుగుతున్నాయి.. ‘తక్షణ న్యాయం’ పేరుతో ఎన్కౌంటర్లు కూడా జరిగాయి.. అయినాగానీ, పరిస్థితిలో మార్పు కనిపించడంలేదు. నేరానికి శిక్ష పడాలి.. అదీ చట్టబద్ధంగా. కానీ, అదే జరగడంలేదన్న ఆవేదన చాలామందిలో వుంది.
నిజమే.. ఆయా కేసుల విచారణ ఏళ్ళ తరబడి సాగుతోంది. నిర్భయ ఘటననే తీసుకుంటే.. బాధితురాలు కొన్నిరోజులపాటు నరకయాతన భరించి చివరికి ప్రాణాలు విడిచింది. కానీ, నిందితులకి ఎప్పుడు శిక్ష పడింది.? పదే పదే నాటకాలాడారు శిక్ష తప్పించుకోవడానికి మృగాళ్ళు.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో వరుస ఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ తక్కువేమీ కాదు. తెలంగాణతో పోల్చితే, ఏపీలో రాజకీయ రాద్ధాంతం ఎక్కువైపోయింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు విపక్షాలకు అధికారపక్షం అవకాశమే ఇవ్వడంలేదు. కోవిడ్ పేరుతో పోలీసు శాఖ పెడుతోన్న ఆంక్షలు అదనం. బాధిత కుటుంబాన్ని తన వద్దకు పిలిపించుకుని ముఖ్యమంత్రి ఓదార్చుతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం.
‘ఆర్థిక సాయం అందించేశాం.. బాధిత కుటుంబానికి న్యాయం చేసేశాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ. కానీ, న్యాయం జరిగిందెక్కడ.? దోషులకు శిక్ష పడిందెక్కడ.? అన్న ప్రశ్న విపక్షాల నుంచి దూసుకొస్తోంది. తెలంగాణలో కొద్ది రోజుల క్రితమే ఓ చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. ఆ ఘటన కంటే మీడియాకి సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన ఎక్కువ ‘ఎట్రాక్ట్’ చేయడం గమనార్హం.
చిన్నారిపై అఘాయిత్యం ఘటనను సైడ్ లైన్ చేయడానికి మీడియానే ఇంతలా కక్కుర్తి పడిందా.? అన్న వాదనా లేకపోలేదు. ఏం చేస్తే ఈ అఘాయిత్యాలు ఆగుతాయి.? ఇదొక సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది. ఆర్థిక సాయం చేయడం కాదు.. రాజకీయ పరామర్శలు, రాజకీయ ఓదార్పులు కాదు.. నేరానికి శిక్ష పడాలి. కానీ, అదే జరగడంలేదు. ఎందుకీ దుస్థితి.? ఎవరిది పాపం.?
128115 934160I really like this weblog website, will certainly come back again. Make certain you carry on creating quality content material articles. 796928