భారతీయ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR) ని చంద్రబాబు( Chandrababu Naidu)నాయుడు పరామర్శించారు. కేసీఆర్ కి ఇటీవలే శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ చికిత్స పొందుతున్న యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు నాయుడు.. మాజీ సీఎంని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకొని ప్రజాసేవ కి రావాలని ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు వైద్యులను ఆరా తీశారు. అనంతరం చంద్రబాబు ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడారు.
‘ కేసీఆర్ తో మాట్లాడాలనిపించి ఆసుపత్రికి వచ్చాను. ఆయన కోలుకోవడానికి ఆరువారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. త్వరలోనే ఆయన కోలుకుని మన మధ్యకి వస్తారు’ అని చంద్రబాబు అన్నారు .
మరోవైపు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా కేసీఆర్ ని పరామర్శించారు. యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను ఆరా తీశారు. శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు వైద్యులు తనతో చెప్పారని భట్టి మీడియాకి వెల్లడించారు. వీరితోపాటు సినీ నటుడు ప్రకాష్ రాజ్, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ని పరామర్శించారు.
ఎర్రవెల్లి లోని తన నివాసంలో కేసీఆర్ గురువారం రాత్రి బాత్రూం లో జారిపడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎడమ తుంటి కి తీవ్ర గాయం అయింది. సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రి వైద్యులు శుక్రవారం ఆయనకి శస్త్ర చికిత్స చేశారు. దీంతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు