BroTheAvatar: సాధారణంగా నిర్మాతల్లో చాలామంది చిన్న చిన్న విషయాలకే తటపటాయిస్తుంటారు. సినిమా రంగం అంటే అద్దాల మేడ. ఎవరు ఏ చిన్న రాయి వేసినా, నష్టం చాలా ఎక్కువగా వుంటుంది. వీలైనంత వరకు వివాదాల జోలికి వెళ్ళడానికి ఇష్టపడరు.
ఒకవేళ ఏదన్నా వివాదం వచ్చినా.. ప్రచారం కోసం వివాదాలు సృష్టించినా.. వెంటనే చల్లారిపోయేలా జాగ్రత్తపడుతుంటారు. ప్రభుత్వాలకు ఎదురెళ్ళడం… అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది సినీ పరిశ్రమ నుంచి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ‘బ్రో’ సినిమా నిర్మాతను బెదిరిస్తోంది. భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అంతే కాదు, ఏకంగా సినీ పరిశ్రమకు వార్నింగ్ ఇచ్చేసింది. మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారంటే, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వార్నింగులానే చూడాలి.
‘వకీల్ సాబ్’ సినిమా సమయంలో వివాదం నడిచింది. అప్పట్లో, నిర్మాత దిల్ రాజు.. అక్కడో మాట.. ఇక్కడో మాట చెప్పడం చూశాం. ‘భీమ్లానాయక్’ విషయంలో వివాదం వచ్చినా.. వెంటనే సద్దుమణిగిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.
ఇప్పుడేమో, ‘బ్రో’ సినిమా వివాదం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరకూ వెళుతోంది. ఇదెక్కడి పైత్యం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు మంత్రి అంబటి రాంబాబు తీరుని చూసి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఏ నిర్మాతా మీడియా ముందుకు రారు.
కానీ, ‘బ్రో’ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ రూటే సెపరేటు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, లీగల్ ఫైట్ అంటూ మొదలు పెడితే, ‘కిందికి లాగేస్తా’నంటూ మంత్రి అంబటి రాంబాబుకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతే కాదు, ‘గాలి మాటల్ని పట్టించుకోదలచుకోలేదు.. నాకు వేరే పనులున్నాయ్.. నేను బిజీగా వున్నాను..’ అంటూ మంత్రి అంబటి రాంబాబు గాలి తీసేశారు.
ఎంత గట్స్ వుంటే.. ఇలా మాట్లాడగలుగుతారు టీజీ విశ్వ ప్రసాద్.! లెక్కలన్నీ పక్కాగా వున్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదన్నది ఆయన వాదన. అందులోనూ నిజం లేకపోలేదు. ‘ఈడీకి మంత్రి ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుంది.? ఈడీ గనుక విచారణ చేపడితే, సహకరిస్తాం.. వివరాలు అందిస్తాం.. భయపడేదేముంది ఇందులో.?’ అనేశారు విశ్వప్రసాద్.
ఇదిలా వుంటే, పరువు నష్టం దావా అంశాన్ని టీజీ విశ్వప్రసాద్ పరిశీలిస్తున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి అంబటి రాంబాబు గనుక ఇంకాస్త ముందుకెళ్ళి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, తరువాత టీజీ విశ్వ ప్రసాద్ యాక్షన్ షురూ చేస్తారు. ‘లీగల్గా మేం చాలా స్ట్రాంగ్.. మాది రాయలసీమ..’ అని ఆల్రెడీ ఆయన ఓ మాట ప్రకటించేసి వున్నారాయె.
అన్నట్టు, ‘బ్రో’ సినిమాని డిజాస్టర్గా కొంతమంది పేర్కొంటోంటే, సినిమా సూపర్ హిట్ అని చెబుతున్నారు టీజీ విశ్వ ప్రసాద్. ‘పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చేసింది. అన్ని చోట్లా బయ్యర్స్ కూడా హ్యాపీ. ఇప్పుడు వస్తున్నవన్నీ లాభాలే..’ అని విశ్వప్రసాద్ చెప్పడం కొసమెరుపు.
ఏదిఏమైనా, అభిమాన హీరో కోసం అండగా నిలబడే ఇలాంటి నిర్మాత దొరకడం ఏ హీరోకి అయినా గర్వకారణమే.! పవన్ కళ్యాణ్కి విశ్వప్రసాద్ లాంటి నిర్మాత అభిమాని కావడం.. చాలా చాలా గొప్ప విషయం. విశ్వ ప్రసాద్ దమ్మున్నోడు.. అంతే కాదు, ‘పవర్’ వున్నోడు కూడా.! విశ్వ ప్రసాద్ కాకుండా ఇంకెవరైనా నిర్మాత అయి వుంటే, ‘బ్రో’ డిజాస్టర్.. అనే దుష్ప్రచారమే నిజమయ్యేది. వైసీపీ మంత్రుల బెదిరింపులు.. బ్లాక్మెయిలింగ్ వరకూ వెళ్ళేవని అభిమానులు అంటున్నారు.