తెలంగాణలోని 17ఎంపీ సీట్లలో రాజకీయం రసవత్తరంగా మారింది. మొదట పోరు ఏకపక్షమేననుకున్నా.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చాలా మార్పులు కనబడుతున్నాయి. ఒక్క సీటును మిత్రపక్షమైన మజ్లిస్కు వదిలిన టీఆర్ఎస్ మిగిలిన 16 స్థానాలు తమవేనంటూ ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సుడిగాలి ప్రచార పర్యటనల్లోనూ ఇదే అంశాన్ని పదేపదే చెబుతున్నారు. 16 మనవే. సందేహం లేదని కార్యకర్తలు, నేతలకు భరోసా కల్పిస్తున్నారు.
16 సీట్లిస్తే దేశాన్ని గడగడలాడిస్తామని.. ఢిల్లీలో చక్రం తిప్పుతామని చెబుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా 16 గెలిస్తే కేంద్రం మెడలు వంచుతామని రోడ్షోల్లో చెబుతున్నారు. మొదట్నుంచీ 16 సీట్లే టార్గెట్గా టీఆర్ఎస్ ప్రచారం ప్రారంభించింది. కానీ.. పార్టీ అంతర్గత సర్వేల్లో పదహారు కాస్త తగ్గి పన్నెండు, పదమూడు మధ్య ఊగిసలాడుతున్నట్లు సమాచారం. అందుకే.. పరిస్థితి చేయిదాటొద్దని భావించిన సీఎం.. హుటాహుటిన పార్టీ అంతర్గత సర్వేలో 16 సీట్లను గతంలో ఎన్నడూలేని మెజార్టీతో గెలుస్తున్నామని వెల్లడైందంటూ మరోసారి ప్రకటించాల్సి వచ్చింది.
ఇంతకీ టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలుస్తుందా? పరిస్థితి ఆ పార్టీకి 100% అనుకూలంగా ఉందా? నామినేషన్లు వేసేంతవరకు ఈ ప్రశ్నలకు అవుననే సమాధామే వచ్చింది. కానీ ఒక్కసారి నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక క్షేత్రస్థాయిలో అసలు సినిమా మొదలైందని తెలుస్తోంది. 88 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్కు 12 ఎంపీ సీట్లు గెలవడం సులభమే. కానీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న తర్వాత బలాన్ని వందకు పెంచుకుంది. ఆ లెక్కలు వేసుకునే 16సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నా.. గ్రౌండ్ లెవల్లో సీన్ వేరోలా ఉంది.
టీఆర్ఎస్ ‘మిషన్ 16’ లెక్కను తగ్గించే అవకాశమున్న నియోజకవర్గాల వారిగా పరిస్థితులను గమనిస్తే.. నిజామాబాద్లో 185 నామినేషన్లు దాఖలవడం దేశం దృష్టిని ఆకర్షించింది. ఇది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా రైతులు తీసుకున్న పెద్ద ముందడుగే. అసెంబ్లీ ఎన్నికల వరకు కనిపించని ఈ వేడి.. ఆ తర్వాత ఊపందుకుంది. పసుపుబోర్డు, ఎర్రజోన్నకు మద్దతు ధర కోసం రైతులు రెండు నెలలుగా రోడ్లపై ధర్నా చేసినా పట్టించుకోకపోవడం. నిజామాబాద్కు ర్యాలీగా బయలుదేరితే అమానుషంగా లాఠీచార్జీ చేయడం వంటివి మీడియాలో చూపించకపోయినా ప్రజల్లో ముఖ్యంతా రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. దీని ప్రభావం ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుంది.
చేవెళ్ల విషయానికి వస్తే.. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరినా ఆయనపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. ఎంపీగా ఆయన చేసిన కార్యక్రమాలు.. స్వతహాగా ఎన్నికల్లో భారీగా ఖర్చుకుపెట్టుకునే సామర్థ్యం ఉన్నందున చేవెళ్లలో ఆయన్ను ఓడించడం అంత సులభం కాదని తెలుస్తోంది.
మహబూబ్నగర్లో డీకే అరుణకు టీఆర్ఎస్ లోక్సభ పక్షనేతగా ఉన్న జితేందర్ రెడ్డి బీజేపీలో చేరి మద్దతివ్వడంతో అక్కడ కమలదళం బలం పెరిగింది. ఇది గెలిచేంతగా ఉంటుందా? అనేది పక్కాగా చెప్పకపోయినా.. టీఆర్ఎస్కు అంత సులువేం కాదనేది బహిరంగ సత్యమే. ఖమ్మం విషయానికొస్తే.. ఇక్కడ టీఆర్ఎస్లోనే మూడు, నాలుగు వర్గాలున్నాయి. పైకి కనబడకపోయినా వీరిమధ్య పరిస్థితి ఉప్పు-నిప్పులాగే ఉంది. మొన్నటివరకు ప్రత్యర్థులుగా ఉన్నవారంతా ఒక పార్టీలో చేరి నామా నాగేశ్వరరావును గెలిపించేందుకు కృషిచేస్తారంటే 100% నమ్మలేం.
దీనికితోడు గిరిజన ఓట్లు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్లోనూ తుడుందెబ్బ నాయకుడిగా సోయం బాపూరావు (బీజేపీ అభ్యర్థి)కు మంచి ఆదరణ ఉంది. ఇవన్నీ ఓట్లుగా మారి.. ప్రజల్లో మార్పువస్తే.. టీఆర్ఎస్ కలగంటున్న మిషన్ 16ను చేరుకోవడం కష్టమే. ఇది టీఆర్ఎస్ నేతలకు, కేసీఆర్కూ తెలుసు. అయితే హీనపక్షంలో 10 సీట్లయినా గెలిస్తేనే కేంద్రంలో తమ మాటకు విలువ ఉంటుందనే లక్ష్యంతో 16 గెలుస్తామని ప్రతిసభలోనూ కేసీఆర్ చెబుతున్నారు.
107634 548465A really intriguing examine, I may not concur completely, but you do make some incredibly valid points. 329773
500215 607124Often the Are normally Weight reduction program is unquestionably an low-priced and flexible weight-reduction plan product modeled on individuals seeking out shed some pounds combined with at some point sustain a far healthier your life. la weight loss 623961