Dogs Attack: హైదరాబాద్ (Hyderabad) లో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన తరహాలో తెలంగాణలో మరొకటి జరిగింది. హనుమకొండ (Hanumakonda) జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ వద్ద వీధి కుక్కల దాడిలో 8ఏళ్ల బాలుడు చోటూ మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు మల్కాన్, సునీత ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నుంచి అజ్మీర్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ (Railway Station) కు వచ్చారు. సంచార జాతులవారు కావడంతో వంట చేసుకునేందుకు రైల్వేస్టేషన్ పక్కన ఉన్న పార్కుకు గురువారం రాత్రి వచ్చారు.
ఉదయం పక్కనే ఉన్న పొదల్లోకి బహిర్భూమికి వెళ్లిన చోటూను ఆరు వీధి కుక్కలు దాడి చేశాయి. పారిపోయే ప్రయత్నంలో దుస్తులు చెట్ల కొమ్మలకు తగిలి కదలలేని పరిస్థితి నెలకొంది. చోటూ అరుపులు కూడా ఎవరికీ వినపడలేదు. దీంతో 15 నిముషాలపాటు బాలుడిపై విచక్షణారహితంగా కుక్కలు దాడి చేయడంతో తీవ్రగాయలతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో చోటూ కుటుంబం కన్నీరుమున్నీరయ్యారు. పదిరోజుల క్రితం ఓ రైల్వే ఉద్యోగి, నాలుగు రోజుల క్రితం ఓ బాలికపై కూడా కుక్కలు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.