మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తన మిత్ర పక్షం శివసేనతో కలిసి అధికార పీఠమెక్కబోతోంది. దాదాపుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలకు తగ్గట్టుగానే వాస్తవ ఫలితాలు కన్పిస్తున్నాయి. 160 సీట్లకు అటూ ఇటూగా బీజేపీ, శివసేన కూటమి దక్కించుకోనున్నట్లు ట్రెండ్స్ని బట్టి అర్థమవుతోంది.
అయితే, అనూహ్యంగా శివసేన పార్టీ ముఖ్యమంత్రి పదవిపై కన్నేసింది. ‘ముఖ్యమంత్రి పదవిని పంచుకుందాం.. తొలుత శివసేనకు అవకాశమివ్వాలి..’ అనే ప్రతిపాదనను శివసేన, బీజేపీ ముందుంచింది. ప్రస్తుతానికైతే బీజేపీ – శివసేన అక్కడ సంయుక్తంగా అధికారంలో వున్నా, బీజేపీ నుంచే ముఖ్యమంత్రి వున్నారు. శివసేన ఇంతలా ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి చూపడానికి కారణం, శివసేన నుంచి పోటీ చేసిన ఆదిత్య థాక్రే కోసమే కావొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
మరోపక్క, కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి అధికారం దక్కించుకోలేకపోతున్నా, అంచనాలకు మించి ఫలితాల్ని రాబడుతున్నాయక్కడ. ఈ పరిస్థితుల్లో బీజేపీ గనుక, శివసేన డిమాండ్కి తలొగ్గకపోతే.. శివసేన, బీజేపీకి దూరమయ్యే అవకాశాలుంటాయి. మరోపక్క, హర్యానాలో ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా వాస్తవ ఫలితాలొస్తున్నాయి. హర్యానాలో హంగ్ పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
బీజేపీకి అత్యధిక సీట్లు దక్కే అవకాశం వున్నా, మెజార్టీని సాధించే పరిస్థితి లేదు. అక్కడ జేజేపీ అనే పార్టీ, బీజేపీ – కాంగ్రెస్ ఫైట్లో లాభపడేలా కన్పిస్తోంది. కర్నాటక మోడల్ని హర్యానాలో అమలు చేయాలనుకుంటున్న కాంగ్రెస్, జేజేపీకి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తుండడం గమనార్హం. ఒకవేళ అదే జరిగితే హర్యానా, బీజేపీ చేజారినట్లే. మహారాష్ట్రంలోనూ శివసేన చెప్పినట్లు వ్యవహరించకపోతే, బీజేపీకి గడ్డు కాలం తప్పకపోవచ్చు.