Adi Purush: తిరుపతి లో జరిగిన ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సినిమా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్న జీయర్ స్వామి వారికి నా పాదాభివందనాలు. చిత్ర బృందానికి, అభిమానులకి కూడా నా నమస్కారం. ‘ఆదిపురుష్’ సినిమా రామాయణంలో కొన్ని ప్రధాన ఘట్టాలను తీసుకుని రూపొందించారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా ఈ సినిమా ని నిర్మించారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత తెలుగులో ఆ స్థాయిలో గ్రాఫిక్స్ ఉన్న ప్రభాస్ సినిమా ఇది. మన భారతదేశ చరిత్రలో ఉన్న గొప్ప ఇతిహాసాలలో ఒకటైన రామాయణాన్ని ఆధునిక టెక్నాలజీని వాడి ప్రస్తుతం ఉన్న యువత కళ్లకు కట్టే విధంగా ఈ సినిమాని నిర్మించారు. సినిమాకి పని చేసిన అందరిని అభినందిస్తూ .. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఈ సినిమాలో హనుమాన్ పాత్ర పోషించిన దేవదత్త నాగ మాట్లాడుతూ … “శతాబ్దాల క్రితం ప్రభు శ్రీరాముడి రాజ్యం ఉండేది. చాలా ఏళ్ల తరువాత చరిత్ర పునరావృతం అవుతోంది. సరిగ్గా ఇదే మళ్ళీ రామరాజ్యం.
ఒక్కడే సూర్యుడు. ఒక్కడే చంద్రుడు. ఒక్కడే డార్లింగ్. అతనే ప్రభాస్. మనం చీకట్లో చిక్కుకున్నప్పుడు వెలుగు కిరణం కోసం ఎదురు చూస్తుంటాం. మన సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. అతనే రాముడి అవతారంలో ఉన్న ప్రభాస్. తిరుపతి ప్రజలను కలవడానికి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. ‘జై శ్రీ రామ్’ అని జపిస్తూ ప్రపంచానికి గొప్ప సినిమాను అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న మన కృతి, మన భూదేవి కూతురు ప్రకృతి. ప్రభాస్ అభిమానుల ప్రేమ అద్బుతం. మళ్లీ జూన్ 16న రామోత్సవ్ను జరుపుకుంటాం’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినిమా సంగీత దర్శకులు అజయ్-అతుల్ మాట్లాడుతూ..’గత రెండేళ్లుగా పాటల కోసం ఎదురుచూస్తున్నాం. టీమ్ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమాకు పనిచేశారు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. పాటలను ఇంతగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అన్ని పాటలు నేడు విడుదల కానున్నాయి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. తెలుగులో ఇది మొదటి సినిమా కాబట్టి ఏవైనా తప్పులుంటే క్షమించండి’ అని అన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “ఆదిపురుష్’ తో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రభాస్ కి ధన్యవాదాలు. టి సిరీస్, రెట్రోఫిల్స్, యువి క్రియేషన్స్కు ధన్యవాదాలు. భవిష్యత్తులో మరిన్ని పెద్ద ప్రాజెక్టులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
ఈ సందర్భంగా టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘’జై శ్రీరామ్.. ఓం రౌత్ వల్ల రాముడి సినిమా చేయాలనే మా నాన్న గుల్షన్ కుమార్ కల నెరవేరింది. ప్రభాస్కు కృతజ్ఞతలు. సినిమాని మలిచిన తీరు అద్భుతం. ‘ఆదిపురుష్’ కేవలం సినిమా కాదు. ఇది ఒక ఎమోషన్. నాకు మాటలు రావట్లేదు మాట్లాడటానికి. మరోసారి ఓం కి ధన్యవాదాలు’ అని తెలిపారు.