పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నదెవరు.? నందమూరి బాలకృష్ణకీ, నారా చంద్రబాబునాయుడికీ మధ్య చిచ్చు పెట్టాలని చూసింది ఎవరు.? నారా లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి మధ్య గొడవలకు ప్రయత్నించింది ఎవరు.? పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై అవాకులు చెవాకులు పేలుతున్నదెవరు.?
చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య లేని వివాదాల్ని వున్నట్లుగా చూపించే ప్రయత్నమెవరిది.?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా, ‘కుటుంబాల్లో చిచ్చు పెట్టే కుట్ర’ అంటూ చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ, విపక్షాలపై విమర్శలు చేశారు.
ప్రధానంగా టీడీపీ, జనసేన మీద విమర్శలు చేశారు వైఎస్ జగన్. చెల్లెలు షర్మిల, కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంపై కలత చెందుతున్న వైఎస్ జగన్, ఆ మంటని విపక్షాల మీద చూపించే ప్రయత్నం చేశారు. అక్కడికేదో, జగన్ కుటుంబంలో టీడీపీ, జనసేన చిచ్చు పెడుతున్నాయన్నట్లుగా మాట్లాడేశారు.
వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా పనిచేసిన వైఎస్ విజయమ్మతో ఆ పదవికి రాజీనామా చేసి, వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా తన పేరుని రాయించుకున్న జగన్, ‘కుటుంబంలో చిచ్చుకి కుట్ర’ అని ఎవరి మీదనో నిందలేస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ షర్మిల, సుదీర్ఘ పాదయాత్ర చేస్తే.. అధికారంలోకి వచ్చాక, ఆమెకు కనీసం రాజ్యసభ పదవి కూడా ఇవ్వకుండా, రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేసిన వైఎస్ జగన్, ‘కుటుంబంలో చిచ్చుకి కుట్ర పన్నుతున్నారు..’ అనడం ఎంతవరకు సబబు.?
అయినా, ఎవరో చిచ్చు పెడితే విడిపోయేంత పలచని కుటుంబమా వైఎస్ కుటుంబం అంటే.? ఈ విషయమై వైఎస్ జగన్ తన అంతరాత్మను ప్రశ్నించుకుంటే తగిన సమాధానం ఆయనకే దొరుకుతుంది.
రాను రాను వైఎస్ జగన్లో అభద్రతా భావం పెరిగిపోతోంది. ముందు ముందు వైఎస్ జగన్ నోట ఇంకెలాంటి మాటలు వస్తాయోగానీ, ‘ఈయనా మన ముఖ్యమంత్రి.?’ అని వైసీపీ శ్రేణులే ఆశ్చర్యపోయేలా ఆయన వ్యవహార శైలి వుంటోంది.