సొమ్మొకరిది.. సోకు ఇంకొకరిది.! పేరు ఒకరిది, పెత్తనం ఇంకొకరిది.! అధికార వైసీపీ తీరు అచ్చం ఇలాగే వుంది.
రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. నాలుగు వందల కోట్ల రూపాయలతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు తెలంగాణలోనూ భారీ విగ్రహమే ఏర్పాటయ్యింది.!
అంబేద్కర్ లాంటి మహనీయుల్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, మహనీయుల విగ్రహాలు పబ్లిసిటీ స్టంట్లకే పరిమితమవుతుండడం అత్యంత బాధాకరం.! అంబేద్కర్ కావొచ్చు, ఇంకో మహనీయుడు కావొచ్చు.. ఆయా వ్యక్తులు ఏనాడూ ప్రచార ఆర్భాటాలకు పోలేదు.
మరి, అంబేద్కర్ పేరుతో ప్రచార ఆర్భాటం ఎందుకు జరిగింది.? ఎందుకు జరుగుతోంది.? ఎందుకంటే, ఇది ఓటు బ్యాంకు రాజకీయం గనుక. తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా అంబేద్కర్ విగ్రహావిష్కరణకు జనాన్ని బస్సుల్లో తరలించాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది.?
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ మరీ అతి చేసింది. జనాన్ని తరలించడం కోసం వైసీపీ సర్కారు చేసిన ఏర్పాట్లు, ఖర్చు గురించి ఊరూ వాడా చర్చించుకుంటున్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది సరే.. ఆ సమయంలో వైఎస్ జగన్ సొంత ప్రచారమేంటి.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాధినేత కాబట్టి.. అని వైసీపీ బుకాయిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఖర్చయ్యింది ప్రజాధనం. ముఖ్యమంత్రి అంటే, ప్రజాధనానికి జవాబుదారీ.! ప్రతి సంక్షేమ పథకానికీ సొంత పేరు పెట్టుకోవడం లేదా, తండ్రి పేరు పెట్టుకోవడం వైఎస్ జగన్కి అలవాటైపోయింది.
గతంలో చంద్రబాబు కూడా ఇదే చేశారన్నది ఎక్స్క్యూజ్ కానే కాదు.! ఈ తరహా పబ్లిసిటీ ఓట్లను రాల్చదని చంద్రబాబుని చూసి కూడా వైఎస్ జగన్ నేర్చుకోలేకపోయారంటే, తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారన్నమాట.!