దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా.? వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ, ముచ్చటగా మూడోసారి అధికార పీఠమెక్కడం అంత తేలిక కాదు.! దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నమాట వాస్తవం. అయితే, ప్రధాని నరేంద్ర మోడీకి ధీటుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలబడతారా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
రాహుల్ గాంధీ గనుక నిలబడితే, నరేంద్ర మోడీ రాజకీయానికి పెద్ద షాక్ తగలబోతోందన్నది నిర్వివాదాంశం. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర విజయవంతమైన దరిమిలా, ఆ యాత్రకు సంబంధించిన మలివిడత యాత్రకు రంగం సిద్ధం చేస్తున్నారట.
ఇదిలా వుంటే, తెలంగాణలో కాంగ్రెస్ అధికార పీఠమెక్కిన దరిమిలా, వైఎస్ జగన్ ఒకింత డీలాపడ్డారు. గులాబీ పార్టీ (బీఆర్ఎస్) మళ్ళీ గెలిచి వుంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా అనుకూలంగా వుండేది. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించి, తెలివిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ వైపు పంపించారు వైఎస్ జగన్.. అన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.
ఇప్పుడేమో, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఎంపికకు దాదాపు రంగం సిద్ధమయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే, వైఎస్ జగన్ వ్యూహం పక్కాగా వర్కవుట్ అయినట్లేనని అంటున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళుతున్నారనీ, అలా ఆమెను కాంగ్రెస్ వైపు నడిపిస్తున్నదే వైఎస్ జగన్ అన్న వాదనకు బలం చేకూరుతోంది. ఇంకోపక్క, జగన్ని దెబ్బ కొట్టడానికే వైఎస్ షర్మిల ఈ పంథా ఎంచుకున్నారన్న వాదనా లేకపోలేదు.
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.! వైఎస్ షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జగన్ దగ్గరవ్వొచ్చు.! లేదా, కాంగ్రెస్లో చేరడం ద్వారా రాజకీయంగా బలోపేతమై, తన అన్నను వైఎస్ షర్మిల రాజకీయంగా దెబ్బ కొట్టనూవచ్చు.!