ఏంటి.. అదంతా నిజమేననుకునేరు.! ఊరికే.! ఉత్త హంగామా చేశారంతే. కొట్టుకునేదాకా వెళ్ళారు. మధ్యలో ఇంకో వ్యక్తి దూరాడు. అనూహ్యంగా గొడవ ఆగిపోయింది. మంచిదే కదా.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్లో భాగంగా తాజా వీకెండ్ ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ల పర్వం వేడెక్కింది.
కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఒక్కరంటే ఒక్కరి దగ్గర కూడా సరైన పాయింట్ లేకుండా నామినేషన్ చేసుకోవడం ఈ ఎపిసోడ్ ప్రత్యేకత అనుకోవాలేమో.! ఆ మాటకొస్తే, ఈ సీజన్ మొత్తం ఇదే తంతు.!
యావర్ – అమర్ దీప్ మధ్య గొడవ అయితే, ఇప్పటిదాకా ఈ సీజన్కి ఇదే హైలైట్ అనిపించింది. అంతకు ముందు అర్జున్ – ప్రశాంత్ మధ్య కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే, యావర్ అలాగే అమర్ దీప్ ఇంకాస్త బరితెగించారు.
పాయింటే లేకుండా తనను మిగతా కంటెస్టెంట్లు నామినేట్ చేస్తున్నారంటూ పదే పదే వాపోతున్నాడు అమర్ దీప్. ఈసారి కూడా అదే పంచాయితీ. ఈ విషయమై యావర్కి చాలా చాలా కోపం వచ్చేసింది. ఓ దశలో ‘ఎవడ్రా నువ్వు..’ అంటూ యావర్ అనడంతో, హర్టట్ అయ్యాడు అమర్ దీప్.
‘కొడతావా.? కొట్టు.!’ అంటూ అమర్ దీప్, యావర్ మీదకు వెళ్ళాడు. దాంతో, ఇద్దరూ కొట్టుకుంటారేమోనన్నంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో శివాజీ రంగంలోకి దిగి, ఇద్దర్నీ దూరంగా పంపించేందుకు ప్రయత్నించాడు.
శివాజీ గనుక మధ్యలోకి రాకపోయి వుంటే, తనను యావర్ కొట్టి వుండేవాడంటూ అమర్ దీప్ వ్యాఖ్యానించడం గమనార్హం. శోభ – అశ్విని మధ్య మాటల పంచాయితీ కూడా కొంత వేడి వాతావరణం సృష్టించింది. ఓవరాల్గా చూస్తే, ఇంకో అర్థం పర్థం లేని ఎపిసోడ్ ఈ సీజన్ బిగ్ బాస్ రియాల్టీ షోలో ఈ రోజు జరిగింది.