జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan)పై ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్( Vijayendra praaad) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మహా మ్యాక్స్ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన పవన్ పై ప్రశంసలు కురిపించారు. అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ వంటి గొప్ప నాయకుడు ప్రజలకు దొరికారంటూ కితాబిచ్చారు.
ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ..’కొద్ది రోజుల క్రితం నా స్నేహితుడు ఫరూక్ ఓ వీడియో పంపారు. అందులో దుర్గమ్మ దర్శనార్థం వస్తున్న భక్తులకు ముస్లింలు మజ్జిగ పంచుతూ కనిపించారు. ఆ వీడియో చూసి నాకు చాలా సంతోషమేసింది. ఇప్పటికి ఆ వీడియో నా మనసులో కదలాడుతూ ఉంది. అదేవిధంగా ముస్లింల పండుగల సమయంలో హిందువులు కూడా అలాంటి సాయం చేస్తే బాగుంటుంది. అలా అందరూ మతసామరస్యాన్ని చూపిస్తే ఎంతో బాగుంటుంది. అయితే అలా చేయడానికి మంచి నాయకుడు కావాలి. ఆ లీడర్ కి చిత్తశుద్ధి ఉండాలి. పదవులు ఉండేది దోచుకోవడానికో దాచుకోవడానికో కాదు. ప్రజాసేవ కోసం పనిచేయడానికని నమ్మిన వ్యక్తి కావాలి. ఏం ఆలోచిస్తారో అదే మాట్లాడేవాళ్లు.. ఏం మాట్లాడుతారో అదే ఆచరణలో పెట్టే వాళ్లు కావాలి. అదృష్టవశాత్తు ఆ లక్షణాలన్నీ పవన్ కళ్యాణ్ లో ఉన్నాయి. మీరంటే ప్రాణం ఇచ్చే అశేషమైన జనసైనికులు ఉన్నారు. వారికి చెప్పి దేశంలో మతసామరస్యం పెంపొందింపజేసే అవకాశం మీకు ఉంది. మీరు చేయండి. ఆ దేవుడు మీకు సాయంగా ఉంటాడు’ అని పవన్ ని ఉద్దేశించి అన్నారు.