వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీతో సర్దుకుపోతున్నారు. ఆ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసెయ్యాలనే నిర్ణయానికి వచ్చేశారు వైఎస్ షర్మిల. త్వరలో కాంగ్రెస్ పార్టీ కండువాని మెడలో కప్పుకోవడమొక్కటే మిగిలింది.! ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫున వకాల్తా పుచ్చేసుకున్నారామె. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అపరామైన గౌరవం వుందనీ చెప్పుకొచ్చారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయమై కాంగ్రెస్ చేసిన పొరపాట్లను క్షమించేశారు కూడా.! అంతేనా, ఆ పధ్నాలుగేళ్ళ వ్యవహారాన్ని ‘వనవాసం’గా కూడా అభివర్ణించేశారు వైఎస్ షర్మిల. ఇదో చిత్రమైన పరిస్థితి. వైఎస్ షర్మిల మాత్రమేనా.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించెయ్యబోతున్నారా.?
నిజానికి, తెలంగాణలో కేసీయార్తో వైఎస్ షర్మిలకు రాజకీయ పంచాయితీ ఏమీ లేదు. అక్కడికేదో, కేసీయార్ పట్ల తమకు బద్ధ శతృత్వం వున్నట్లు వైఎస్ షర్మిల వ్యవహరించారు. కేసీయార్ని గద్దె దించేదాకా తగ్గేదే లే.. అంటూ శపథాలు చేసిన వైఎస్ షర్మిల, ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరడానికి సరైన కారణమైతే చెప్పలేకపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పాలేరు అసెంబ్లీ టిక్కెట్టుని ఆశిస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ సీటుని కూడా ఆమె ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం ఎంపీ సీటుపైనా షర్మిల కన్నేశారట.! ఇవన్నీ జరిగే పనులేనా.?
ఇవేవీ కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి.. అందునా కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని షర్మిల అనుకుంటున్నారన్నది ఇంకో ప్రచారం. అదే ఆమె ఆలోచన అయితే, వైసీపీ నుంచే టిక్కెట్టుని ఆశించొచ్చు కదా.? కానీ, ఎక్కడో వ్యవహారం తేడా కొడుతోంది. షర్మిలను కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గరకి వైఎస్ జగన్ స్వయంగా పంపించి వుంటారన్న అనుమానాలు వైసీపీలోనే వ్యక్తమవుతున్నాయి.
అలా చేస్తే, బీజేపీ గుస్సా అవుతుంది కదా.? ఏమో, వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో గెలవదని బహుశా వైఎస్ జగన్ నమ్ముతున్నారేమో.! అందుకే, కాంగ్రెస్ వైపు టర్న్ అవుతున్నారేమో.!