నెల్లూరు కి చెందిన ఆరేళ్ల చిన్నారి లక్షిత పై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నడక దారిలో చిన్నారుల ప్రవేశం పై ఆంక్షలు విధించింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రతకి రక్షణ చర్యలు చేపట్టింది. ఇకపై మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను అలిపిరి నడక మార్గం ద్వారా అనుమతించరు.
రెండు కనుమ దారుల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. ఏడో మైలు వద్ద చిన్న పిల్లలకు పోలీసులు ట్యాగ్ వేస్తారు. తల్లిదండ్రుల నుంచి చిన్నారులు తప్పిపోతే ఆ ట్యాగ్ వివరాల ద్వారా వాళ్ళని ట్రేస్ చేయొచ్చు. ఆ ట్యాగ్ పై చిన్నారి పేరు, తన తల్లిదండ్రుల పేర్లు, వారి ఫోన్ నెంబర్, అడ్రస్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్లను పొందుపరచనున్నారు.
అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో పులులు, చిరుతలు సంచరిస్తే వాటిని పట్టుకోవడానికి ఎక్కడికక్కడ బోన్లను ఏర్పాటు చేశారు. అలాగే వన్య మృగాలు నడక మార్గం వైపు రాకుండా ఎక్కడికక్కడ సౌండ్ సిస్టమ్స్, లైటింగ్ సిస్టం ని ఏర్పాటు చేయనున్నారు. జంతువుల్ని దూరంగా తరిమేందుకు ఇవి ఉపయోగపడతాయని టిటిడి అధికారులు తెలిపారు. వీటితోపాటు సెంట్రీ పోస్టులు, సిసి కెమెరాలు, ఫెన్సింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. క్రూర మృగాల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు భక్తులు సహకరించాలని టిటిడి కోరింది.