తెలంగాణలో ఎన్నికల సందడి కనిపిస్తోంది.! కానీ, కనిపించాల్సిన స్థాయిలో కాదు. అధికార భారత్ రాష్ట్ర సమితి ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేసిన దరిమిలా.. ఆ పార్టీ నేతలు కొంత యాక్టివ్గా కనిపిస్తున్నారు. మిగతా పార్టీలే ఇంకా గ్రౌండ్ లెవల్లో అవ్వాల్సిన స్థాయిలో యాక్టివ్ అవలేకపోతున్నారు.
బీజేపీ కావొచ్చు, కాంగ్రెస్ కావొచ్చు.. ఈ పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు అధికార బీఆర్ఎస్కి కలిసొస్తున్నాయి. అలాగని, బీఆర్ఎస్ పార్టీలోనూ కుమ్ములాటలు వున్నాయ్. కాకపోతే, గులాబీ పార్టీ నేతల అగ్రెసివ్ క్యాంపెయిన్, ఆ పార్టీ శ్రేణుల హంగామా నడుమ.. ఆ కుమ్ములాటలు పెద్దగా హైలైట్ అవడంలేదు.
ఇంతకీ, జనం ఏమనుకుంటున్నారు.? గ్రామ స్థాయిలో రాజకీయాలు ఎలా వున్నాయి.? నిజానికి, అసలంటూ తెలంగాణలో ప్రజలు ఎన్నికల వాతావరణాన్ని సరిగ్గా ఫీల్ అవడంలేదు. అయితే, ఆయా పార్టీల క్యాంపెయిన్లు జరుగుతున్నప్పుడు మాత్రం అప్పటికప్పుడు సందడి నెలకొంటోంది.
చిత్రమైన విషయమేంటంటే, గతంలోలా జనం.. ఆయా పార్టీల వెంట పెద్దగా కనిపించడంలేదు. ప్రచార కార్యక్రమాల కోసం డబ్బులిచ్చి, మద్యం పంచి కూడా జనాన్ని రప్పించడం చాలా చాలా కష్టమవుతోంది రాజకీయ పార్టీలకి. రోజువారీ ఖర్చులూ గణనీయంగా పెరిగిపోయాయి.
అన్ని ఖర్చుల్నీ ఎన్నికల కమిషన్ జాగ్రత్తగా వాచ్ చేస్తోంది గనుక, కనిపించీ కనిపించకుండా ఖర్చు చేయడం చాలా చాలా కష్టమైపోతోంది ప్రధాన రాజకీయ పార్టీలకి. ఇదంతా ఓ ఎత్తు.. ఎన్నికల పోలింగ్ రోజున, ఓటుకు చెల్లించాల్సిన ఖర్చు వ్యవహారం ఇంకో యెత్తు.
తెలంగాణలో చాలా చోట్ల, ‘ఈసారి ఓటుకు ఎన్ని నోట్లు ఇస్తారో..’ అన్న చర్చ ప్రముఖంగా జరుగుతోంది. ఐదు వేలా.? పది వేలా.? పదిహేను వేలా.? ఇలా పెంచుకుంటూ పోతున్నారు జనం ఆయా చర్చల్లో. ‘ఏం, ఎందుకు ఇవ్వరు.?’ అన్న ప్రశ్న కూడా ఆయా చర్చల్లో కనిపిస్తోంది.