అధికారంలోకి వచ్చక గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడం అనేది ఎవరైనా చేసే పనే. కాకపోతే, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తున్నారట. కేసీయార్ హయాంలో జరిగిన అప్పులు సహా, చాలా అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
నామినేటెడ్ పోస్టులు పొందిన వారికి సంబంధించి, ఆయా విభాగాల తాలూకు లెక్కలన్నీ తెప్పించుకుని, వారి సమక్షంలోనే లెక్కలన్నీ తేల్చిన తర్వాతగానీ, వారి రాజీనామాల్ని ఆమోదించకూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా విద్యుత్ శాఖ మీద ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేసీయార్ హయాంలో జరిగిన ఒప్పందాలు, జరిగిన ఖర్చులు.. వంటి వాటి లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. కేసీయార్ పార్టీ ఓడిపోగానే, విద్యుత్ శాఖకు చెందిన కీలక పదవిలో వున్న ఓ ప్రముఖుడు రాజీనామా చేయడంతో, ఆయన రాజీనామాను ఆమోదించకుండా, తమ క్యాబినెట్ సమీక్షకు ఆయన్ని పిలిపించారు సీఎం రేవంత్ రెడ్డి.
దాంతో, నామినేటెడ్ పదవుల్లో ఇప్పటిదాకా వున్న చాలామంది ప్రముఖులు కంగారు పడుతున్నారు. నిజానికి, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని అభినందించకుండా వుండలేం.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఇదీ. రేప్పొద్దున్న ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారితే, అక్కడా ఇదే తరహా ‘స్క్రూటినీ’ తప్పనిసరి అనుకోవాలేమో.! ఎడా పెడా సలహాదారులు, ఇష్టమొచ్చినట్లు నామినేటెడ్ పదవులు పంచుకుంటూ పోయింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆ కారణంగా రాష్ట్ర ఖజానాకి కలిగిన నష్టమెంతో తేలాలి కదా.?
ప్రభుత్వమంటే, ప్రజలకు జవాబుదారీగా వుండాలి. నచ్చినోళ్ళకు నచ్చిన విధంగా పదవులు కట్టబెట్టి, ప్రజాధనాన్ని లూటీ చేసేది అసలు ప్రభుత్వమే కాదు.! ప్రభుత్వ ప్రకటనల దగ్గర్నుంచి, కాంట్రాక్టుల వరకు అన్నిటికీ సంబంధించి ‘శ్వేత పత్రాలు’ విడుదల చేస్తే, రాజకీయ అవినీతిని దాదాపుగా కూకటి వేళ్ళతో పెకిలించేసినట్లే అవుతుంది.