‘ఏ క్షణం అయినా దిగపోవాల్సి వస్తే ముఖ్యమంత్రి పదవి నుంచి నేను దిగిపోవడానికి సిద్ధం’ అంటూ ఈ మధ్యనే సొంత ప్రచారం కోసం దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి నిర్వహించిన కాంక్లేవ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
ఈ విషయమై, సోషల్ మీడియాలో పెద్దయెత్తున దుమారం చెలరేగింది. ‘అబ్బే, ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన ఉద్దేశ్యం వేరు’ అని వైసీపీ ఎన్ని కవర్ డ్రైవులు ఆడినా.. జరగాల్సిన నష్టం అప్పటికే చాలా పెద్దయెత్తున జరిగిపోయింది.
తాజాగా, ఇదే విషయమై వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్ జగన్ అలా అనడంలో తప్పేముంది.? ఎంజాయ్ చేశారు.. దిగిపోవడానికి సిద్ధమన్నారు..’ అనే అర్థంలో వ్యాఖ్యానించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఆ ‘ఎంజాయ్ చేయడం’ అనే మాట స్పష్టంగా వినిపించడంతో, అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప, వైసీపీ అధికారంలోకి వచ్చాక, అభివృద్ధి అన్న ఆలోచనే చేసింది లేదు.
రాజధాని అమరావతిని గాలి కొదిలేసి, మూడు రాజధానులంటూ పబ్లిసిటీ స్టంట్లు చేసి, ఆ మూడు రాజధానుల చట్టాన్నీ తమ స్వహస్తాలతో చింపి పడేసి.. అబ్బో వైసీపీ హయాంలో జరిగిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు.
ప్రత్యేక హోదా లేదాయె, కడప స్టీలు ప్లాంటు లేదాయె.. పోలవరం ప్రాజెక్టూ పూర్తి కాలేదాయె.! అప్పుడప్పుడూ బటన్లు నొక్కుతూ, ఈ క్రమంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి బహిరంగ సభలు నిర్వహించి, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదీ ముఖ్యమంత్రి హోదాలో.
దీన్ని ఎంజాయ్మెంట్ అని కాక ఇంకేమనగలం..? అదే మాట, అసలు మాట.. సజ్జల రామకృష్ణా రెడ్డి నోటి వెంట పొరపాటున వచ్చేసింది. పొరపాటున కాదు.. నిజమే చెప్పేశారాయన.! ఒక్కమాటలో చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఓ ఆట ఆడుకుంది వైసీపీ గడచిన ఐదేళ్ళుగా.