తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మనిషి.? ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ ‘రెడ్డి’ గనుక, వైసీపీ మనిషేనట.! ‘మా రెడ్డి..’ అంటూ వైసీపీ శ్రేణులు, రేవంత్ రెడ్డిని కలిపేసుకుంటుండడం ఆశ్చర్యకరం.
మరోపక్క, ‘రేవంత్ రెడ్డి మావాడు.. మా పార్టీకి చెందినోడు.. చంద్రబాబు అభిమాని.. చంద్రబాబు శిష్యుడు..’ అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇదో చిత్రమైన సందర్భం.
రేవంత్ రెడ్డి క్యాబినెట్లో వున్న తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క.. ఒకప్పుటు చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు. ఇప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క.. చంద్రబాబుతో టచ్లోనే వున్నారనుకోండి.. అది వేరే సంగతి.
మరోపక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. జగన్ కోసం ఏకంగా మంత్రి పదవిని వదిలేసుకున్నారు కొండా సురేఖ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు దైవంతో సమానమని తెలంగాణ కొత్త డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెబుతున్నారు.
మరో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంగతి తెలిసిందే. ఆయన గతంలో వైసీపీ ఎంపీ. ఆయన కోసమే, ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకున్నారు వైఎస్ షర్మిల.
మొత్తమ్మీద, తెలంగాణ క్యాబినెట్లో అటు వైఎస్సార్ అభిమానులు, ఇటు చంద్రబాబు అభిమానులూ వున్నారు. రాజకీయం వేరు, అభిమానం వేరనుకోండి.. అది వేరే సంగతి.! టీడీపీ, వైసీపీ.. తెలంగాణ రాజకీయాల్ని చూసి సంబరాలు చేసుకుంటున్న వైనం మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.
ఇందులోకి కుల జాడ్యం తీసుకొస్తుండడం మరింత హాస్యాస్పదం.! కాదేదీ రాజకీయానికి అనర్హం. అంతే మరి.!