ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ సంచలన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణల వీడియోలు వైరల్ గా మారాయి. చంద్రబాబును ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన కొన్ని అంశాలు వీడియోలో రికార్డయ్యాయి.
అవి ఎన్నికలకు ముందు బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతోంది. తొలుత విడుదలైన వీడియోలో దివంగత ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఉండగా.. తాజాగా విడుదలైన వీడియోలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. ప్రభుత్వ ఉద్యోగులనుద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వాటిని టీడీపీ అధినేత చంద్రబాబు సమర్థించినట్టుగా మాట్లాడటం సంచలనం కలిగిస్తోంది.
ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ అమలుకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు చంద్రబాబు మాట్లాడగా.. రాధాకృష్ణ అడ్డుకుని, ‘‘అసలు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళదాం అనుకుంటున్నారు అందరూ’’ అని బాబును ప్రశ్నించారు. దీనికి బాబు బదులిస్తూ అదేం కాదు.. అది వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అవుతుంది అంతే’ అని పేర్కొన్నారు. ‘నాన్ ప్లాన్ ఇప్పటికే తడిసి మోపెడైంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే, ఇదీ అంతే. అయినా ఆ నా కొడుకులకు జీతాలు ఇవ్వడానికా జనం టాక్సులు కట్టేది’ అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఈ దశలో బాబు మాట్లాడుతూ.. ‘వాళ్లని కూడా లాగాలి కదా’ అని పేర్కొన్నారు. ‘సరే అది మీ ఇష్టం అనుకోండి. అది వేరే విషయం’ అని రాధాకృష్ణ మాట్లాడారు. దీనికి బాబు మళ్లీ స్పందిస్తూ.. ‘నేను చెప్పేది వింటావా. నువ్వు చెప్పేది కరెక్టే. కానీ అధికారం లేకపోతే మనం ఏమీ చేయలేం’ అని చెప్పడంతో వీడియో క్లిప్ కట్ అయింది. మరి దీనికి కొనసాగింపు క్లిప్ ఏమైనా ఉందో లేదో చూడాలి.
తొలుత విడుదలైన వీడియోలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ గురించి ఇరువురి మధ్యా సంభాషణ జరిగింది. ఇంకా పేరు మార్చలేదేంటని రాధాకృష్ణ అడగ్గా.. మార్చేద్దాం మార్చేద్దాం.. వాడి పేరు తీసేద్దాం అంటూ చంద్రబాబు అనడం సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను, తాజాగా ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా ఈ సంభాషణలు ఉన్నాయంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు. దీనిపై రాధాకృష్ణ వివరణ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ ను ఉద్దేశించి తాము ఏమీ అనలేదని, వీడియోను కట్ అండ్ పేస్ట్ చేయడం ద్వారా ఆ అర్థం వచ్చేలా చేశారని వైఎస్సార్ సీపీని విమర్శించారు.
అయితే, తాజా వీడియోలో మాత్రం రాధాకృష్ణ ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. వాటిని చంద్రబాబు సమర్థించడం చాలా స్పష్టంగా తెలుస్తోంది. వీడియో ఆగినట్టుగా గానీ, జర్క్ ఇవ్వడం వంటి అంశాలు ఏవీ చోటుచేసుకోలేదు. దీంతో పోలింగ్ కు సరిగ్గా రెండు రోజుల ముందు వెలుగుచూసిన ఈ ఎపిసోడ్ ఎక్కడకు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీని ప్రభావం ఓటింగ్ పై ఏమైనా పడుతుందేమో అని తెలుగు తమ్ముళ్లు కలవరపడుతున్నారు. మరి ఈ వ్యవహారాన్ని చంద్రబాబు, రాధాకృష్ణ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
351694 64806I took a break to view your post. I identified it very relaxing 198167