‘సాక్షిలో నాకూ వాటాలున్నాయ్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదీ, నాదీ సమాన వాటా..’ అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశాక, వైఎస్సార్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు సాక్షి మీడియాలో ఎవరికెంత వాటాలున్నాయి.? ఆ లెక్కలేంటి.?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతగా వున్న సమయంలో, కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టిన మీడియా సంస్థ సాక్షి. వైఎస్సార్ అప్పట్లో ముఖ్యమంత్రిగా వున్నారు గనుక, ఆ సంస్థని తన కుమారుడితో పెట్టించారు. కుమారుడు వైఎస్ జగన్ హైలైట్ అయ్యారు తప్ప, అప్పట్లో షర్మిల జాడ కనిపించలేదు.. ఆ మీడియా సంస్థకు సంబంధించి.
కానీ, వాటాలైతే ఖచ్చితంగా వుండే వుంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎటూ వాటాలు వుండవు. వాటాలు జగన్, షర్మిల పేరు మీదనే రాయబడి వుండొచ్చు. అంతేనా.? అది తేలాలంటే వైఎస్ విజయమ్మ పెదవి విప్పాల్సిందే. ఆమె ఆ గుట్టు విప్పుతారా.?
సాధారణంగా అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతరాత్మగా చెప్పబడే కేవీపీ రామచంద్రరావు అప్పట్లో అన్ని వ్యవహారాలూ చూసుకునేవారు. ఆయనకీ, సాక్షి మీడియా వ్యవహారాలు తెలిసే వుండొచ్చు. ఆయన కూడా రేపో మాపో పెదవి విప్పే అవకాశాలు లేకపోలేదు.. అదీ వైఎస్ షర్మిలకి అనుకూలంగా.
ఏ విషయమ్మీద ‘అన్న’ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించాలనుకున్నా (కుటుంబ వ్యవహారాలకు సంబంధించి) అమ్మ విజయమ్మని అడగండి.. అంటూ, బంతిని విజయమ్మ కోర్టులోకి తెలివిగా తోసేస్తున్నారు వైఎస్ షర్మిల.
మామూలుగా అయితే, తల్లి విజయమ్మను రంగంలోకి దించి, షర్మిల మీదా విమర్శలు చేయించేయగలరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కానీ, ఇక్కడ అలాంటి పప్పులేమీ ఉడకడంలేదు. అయినా, వాటాలునప్పుడు మొహమాటమెందుకు.? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అందులో వార్తలు వైఎస్ షర్మిల రాయించుకోవచ్చు కదా.?
ఏమో, రానున్న రోజుల్లో సాక్షి మీడియా ఈ కుటుంబ కలహాలతో రెండుగా చీలిపోతుందేమోనన్న అనుమానాలు ఆ గ్రూపులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో వ్యక్తమవుతుండడం కొసమెరుపు.