Pawan Kalyan: ‘వరాహి కాదు.. వారాహి.! అ.. ఆ.. లు చదువుకోవాలి. అన్నీ నేర్పిస్తాం. జనసేన వయోజన సంచార విద్య ద్వారా నేర్పించేద్దాం. దీర్ఘాలు, ఒత్తులు.. అన్నీ నేర్పించడానికి సిద్ధంగానే వున్నాం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సెటైర్లేశారు.
జ్వరంతో బాధపడుతున్న జనసేనాని, భీమవరంలో విశ్రాంతి తీసుకుంటూనే, పార్టీ ముఖ్య నేతలతోనూ, స్థానిక నేతలతోనూ, స్థానిక ప్రజలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన తాజా సినిమా ‘బ్రో’ టీజర్కి సంబంధించి డబ్బింగ్ కూడా దర్శకుడు సముద్రఖని పర్యవేక్షణలో భీమవరం నుంచే పూర్తి చేశారు పవన్ కళ్యాణ్.
తన మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలపైనా, వెకిలి వ్యాఖ్యలపైనా జనసేనాని, భీమవరంలో స్పందించారు. ‘ఇచ్చేద్దాం.. తిరిగిచ్చేద్దం.. లోపల నుంచి మాటలు తన్నుకొస్తున్నాయ్. కానీ, 30వ తేదీ బహిరంగ సభ కోసం వుంచుకోవాలి కదా వాటిని.. అప్పుడు చెబుదాం..’ అంటూ జనసేనాని, పార్టీ శ్రేణులతో వ్యాఖ్యానిస్తూ చెప్పారు.
ఈ నెల 30న, అంటే రేపే భీమవరంలో ‘వారాహి విజయ యాత్ర’ బహిరంగ సభ జరగనుంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన జనసేనాని అనూహ్యమైన రీతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. తొలుత గెలిచినట్లుగా ప్రచారం జరిగి, చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఓటమి.. అంటూ ప్రకటన రావడం పట్ల ఇప్పటికీ అనుమానాలున్నాయి.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘భీమవరం’లో గెలుస్తాం.. అంటున్నారు జనసేనాని. అయితే, భీమవరం నుంచే పోటీ చేస్తారా.? అన్నదానిపై స్పష్టత లేదు. అది కూడా రేపే స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఈ నెల 30న భీమవరంలో నిర్వహించబోయే ‘వారాహి విజయ యాత్ర’ తర్వాత, ఆ యాత్రకు కొనసాగింపుపై ఎలాంటి ప్రకటన రాబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ వుంది.