‘ఆస్తులు, ఊళ్లతోపాటు నా కొడుకులు నన్ను కూడా పంచుకున్నారు. నన్ను సగభాగం కోసి పంచుకోలేరు కదా అందుకే ఆరు నెలలు ఒక కొడుకు దగ్గర మరో ఆరు నెలలు ఇంకో కొడుకు దగ్గర ఉంటాను. ఇక్కడ ఆరు నెలలు గడిచిపోయింది. రేపు మరో కొడుకు దగ్గరికి వెళ్ళాలి’ అంటూ కొన్నాళ్ల క్రితం వచ్చిన ఓ సినిమాలో హీరోయిన్ తాత హీరోతో తన బాధను పంచుకుంటాడు.
నిజానికి ఇది సినిమానే అయినా నిజజీవితంలోనూ ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. కని పెంచిన తల్లిదండ్రులకి వయోభారం మీద పడగానే కన్నబిడ్డలు వదిలించేసుకుంటున్నారు. వృద్ధాశ్రమాలకి ‘ఓల్డ్ ఏజ్ హోమ్స్’ అనే అందమైన పేరు పెట్టి వారిని వదిలించుకుంటున్న వారు కొందరైతే.. తల్లిదండ్రుల పోషణను వంతుల వారీగా పంచుకుంటున్న వాళ్ళు ఇంకొందరు. ఇటు వృద్ధాశ్రమాల్లో ఉండలేక వంతుల వారి పోషణలో ఇమడలేక తనువు చాలిస్తున్న పండుటాకులెన్నో. తాజాగా సిద్దిపేటలో ఇలాంటి హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది. పుట్టి పెరిగిన ఊరిని వదిలిపెట్టి వెళ్లలేక, కొడుకుల వంతుల వారి పోషణ మింగుడు పడక తన చితి తానే పేర్చుకొని ఆత్మాహుతి చేసుకున్నాడో వృద్ధుడు.. వివరాల్లోకెళ్తే..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి కి చెందిన మేడబోయిన వెంకటయ్య (90) భార్య కొంతకాలం కిందటే మరణించింది. ఆయనకు నలుగురు కుమారులు కనకయ్య, ఉమ్మయ్య, పోచయ్య ,ఆరయ్య ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు పొట్లపల్లిలో, మరొకరు హుస్నాబాద్ లో, ఇంకొకరు కరీంనగర్ జిల్లా నవాబుపేటలో నివసిస్తున్నారు. వెంకటయ్య కొన్నాళ్లపాటు పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉన్నాడు. అయితే పోషణ విషయంలో పెద్ద కొడుకు పంచాయతీకి వెళ్లడంతో.. వెంకటయ్యని నలుగురు కుమారులు వంతుల వారీగా పోషించాలని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు.
దీంతో పొట్లపల్లిలో ఉన్న ఇద్దరు కుమారుల వంతు తీరింది. ఇక నవాబుపేటలో ఉన్న కొడుకు వద్దకు వెళ్లాల్సి ఉంది. ఊరు వదిలి వెళ్లడం ఇష్టంలేని వెంకటయ్య ఈనెల 2న ఆ ఊరిలోని ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లాడు. ఆ రాత్రి అక్కడే నిద్రించి నవాబుపేటలోని తన కుమారుడి వద్దకు వెళ్తానని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు ఏ కుమారుడు వద్దకు వెళ్లలేదు. గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామ సమీపంలో కాలిన స్థితిలో మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం వెంకటయ్య దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. అదే స్థలంలో కుప్పగా పేర్చిన తాటి కమ్మలు కాలిన స్థితిలో కనిపించాయి. దీంతో వెంకటయ్య తాటి కమ్మలను కుప్పగా పేర్చి దానికి నిప్పంటించి అందులో దూకి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.