తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ సాక్షిగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వయసులో కూడా ఆయనింత ఉత్సాహంగా కన్పిస్తుండడం పట్ల పార్టీలో కొందరు నేతలు హర్షం వ్యక్తం చేయొచ్చుగాక. ‘ఈ వయసులో ఇదంతా అవసరమా.?’ అని కొందరు ఆవేదన వ్యక్తం చేయొచ్చుగాక. కానీ, పార్టీలో చంద్రబాబు ఉత్సాహానికి తగ్గుట్లుగా పనిచేయడంలో ఇతర ముఖ్య నేతలు విఫలమవుతున్నారు.
టీడీపీ వాయిస్ని బలంగా విన్పించడంలో ఒకప్పుడు నేతలు పోటీ పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీడీపీ నుంచి కొందరు నేతలు న్యూస్ ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లో ఏదో మాట్లాడుతున్నారంటే, మాట్లాడుతున్నారంతే. అంతకు మించి, మునుపటి టీడీపీ వాడి, వేడి.. ఇప్పుడు ఆ నేతల్లో కన్పించడంలేదన్నది నిర్వివాదాంశం.
మామూలుగా అయితే, చంద్రబాబు అసెంబ్లీలో, టీడీపీ శ్రేణులు జనంలో.. అన్నట్టుండాలి పరిస్థితి. చంద్రబాబు పోరాటం చేస్తోంటే అది అర్థం పర్థం లేని ఆరాటంగా మారిపోతోంది. పుత్రరత్నం నారా లోకేష్లోనే అంత సీరియస్నెస్ కన్పించడంలేదు. అచ్చెన్నాయుడో మరొకరో టీడీపీ తరఫున గట్టిగానే వాకాల్తా పుచ్చుకుంటున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జోరు టీడీపీకి పెద్దగా ఉపయోగపడ్డంలేదు.. ‘అంతకు మించి’ అనే స్థాయిలో టీడీపీ పోరాటం వుండాలి. కానీ, ఓ మోస్తరు స్థాయిలో కూడా కన్పించపోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారట.
ప్రతిరోజూ, పార్టీ ముఖ్య నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తున్నా, దాని వల్ల ఉపయోగం లేకపోవడం గమనార్హం. ఇలాగైతే, ఇంకో నాలుగున్నరేళ్ళు వైసీపీ ‘దాడి’ని తెలుగుదేశం పార్టీ తట్టుకోగలదా.? ఛాన్సే లేదు. సో, ఎక్కువకాలం చంద్రబాబు ‘ఆరాటం’ కొనసాగే అవకాశాలు లేవన్నమాట.