ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మూడు నాలుగు గ్రూపులున్నాయ్.! ఏపీ బీజేపీలో ఆ గ్రూపుల డామినేషనే ఎక్కువ.. అసలు సిసలు బీజేపీ నేతల కంటే.!
ఒకటేమో వైసీపీ అనుకూల గ్రూపు, ఇంకోటి టీడీపీ అనుకూల గ్రూపు.! మరొకటేమో, జనసేన అనుకూల గ్రూపు.! మిగిలింది అసలు సిసలు బీజేపీ గ్రూపు.! ఏపీలో బీజేపీకి వున్న ఓటు బ్యాంకు శాతం ఒకటి నుంచి రెండు లోపు మాత్రమే. ఇది బహిరంగ రహస్యం.!
కేంద్రంలో బీజేపీ అధికారంలో వున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం తన ఉనికిని చాటుకోలేకపోతోందంటే, ఇది స్వయంకృతాపరాధమే. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా, మిత్రపక్షం జనసేన పార్టీ నుంచి పూర్తి మద్దతు లభించినా, బీజేపీ తనదైన ప్రత్యేకతను చాటుకోలేకపోయిందంటే కారణం, బీజేపీలోని మిగతా రెండు గ్రూపుల కొట్లాట వల్లనే.
మరీ ముఖ్యంగా, బీజేపీలోని వైసీపీ అనుకూల గ్రూపు, రాష్ట్రంలో బీజేపీని దెబ్బ తీస్తోంది. 2024 ఎన్నికల్లో జనసేన – టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేయాలన్నది జనసేనాని పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. వైసీపీని ఎదుర్కోవడానికి ఇదో చక్కటి మార్గమని జనసేనాని పదే పదే చెబుతున్నారు.
కానీ, బీజేపీ ఈ విషయమై ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే, తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యాక, ఈక్వేషన్స్ మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ సూచన మేరకే నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాని కలిశారన్నది ఓ వాదన.
కాదు కాదు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (నారా లోకేష్ తల్లి భువనేశ్వరికి స్వయానా సోదరి) చొరవతోనే ఈ భేటీ జరిగిందన్నది ఇంకో వాదన. ఎవరి వాదనలు ఎలా వున్నా, జనసేన – టీడీపీ – బీజేపీ.. ఈ మూడూ కలవడానికి ఈ భేటీ దోహదపడొచ్చు. ఏపీలో బీజేపీ తన ఉనికిని చాటుకోవాలంటే, ఈ కూటమి తప్ప ఇంకో మార్గం లేదు.