సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనంలోకి వెళ్ళబోతున్నారట.! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో తల్లడిల్లిపోయి తనువు చాలించినవారి కుటుంబాల్ని పరామర్శించబోతున్నారట నందమూరి బాలకృష్ణ.
‘మీరెవరికీ భయపడద్దు.. మీ కుటుంబాల్ని ఆదుకుంటా.. పరామర్శ కోసం వస్తున్నా.! నేనున్నా.. అరాచక ప్రభుత్వాన్ని నిలదీస్తా..’ అంటూ నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయి, రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న దరిమిలా, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాల్ని నందమూరి బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రస్తుతం పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలయ్య మీదనే పార్టీ బాధ్యతలు వచ్చిపడ్డాయ్.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అర్భకుడిగా నందమూరి బాలకృష్ణ అభివర్ణించారు.
కాగా, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో, టీడీపీకి అండగా నిలిచిన అన్ని విపక్షాలకూ థ్యాంక్స్ చెప్పారు నందమూరి బాలకృష్ణ. ‘వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో వున్నారు. అందుకే, చంద్రబాబుని 16 రోజులైనా జైల్లో వుంచాలని, కుట్ర పన్ని, అవినీతి ఆరోపణలు సృష్టించి కేసు పెట్టి, చంద్రబాబుని జైలుకు పంపించారు.’ అని ఆరోపించారు బాలకృష్ణ.
అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలన్న బాలకృష్ణ, ఎలాంటి ఆధారాల్లేకుండా చంద్రబాబుని అరెస్టు చేశారనీ, ఈ కేసు నిలబడదనీ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం 370 కోట్లు ఖర్చు చేస్తే, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల మందికి పైగా శిక్షణ లభించిందని బాలకృష్ణ చెప్పకొచ్చారు.
‘కొందరు మీ మీద విమర్శలు చేస్తున్నారు కదా..’ అని ఓ ప్రశ్న మీడియా నుంచి బాలయ్య మీదకు వస్తే (కొడాలి నానిని ఉద్దేశించి), ‘కొందరు మొరుగుతారు.. వాటిని పట్టించుకోను..’ అని సమాధానమిచ్చారాయన. కాగా, అభివృద్ధికీ, సంక్షేమానికీ చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అనీ, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైనా వుందనీ బాలకృష్ణ అన్నారు.