వైసీపీలో చేరాలనుకున్నారు, చేరిపోయారు.! వైసీపీ నేతగా ముద్రగడ పద్మనాభం ఏమైనా మాట్లాడొచ్చు. కానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి సగం సీట్లను పొత్తులో భాగంగా తెచ్చుకుని వుంటే.. అంటూ ముద్రగడ వ్యాఖ్యానించడం ముమ్మాటికీ హాస్యాస్పదమే.
జనసేన పార్టీని ముద్రగడ పద్మనాభమో, చేగొండి హరిరామ జోగయ్యో.. ఇంకొకరో డిక్టేట్ చేయలేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం ధారపోస్తున్నారు. జనసైనికులు ఈ క్రమంలో జనసేనానికి అండగా నిలుస్తున్నారు. కేవలం కాపు సామాజిక వర్గం కోసమే జనసేన పని చేయడంలేదు.
ముద్రగడ కావొచ్చు, చేగొండి కావొచ్చు.. తాము ఓ సామాజిక వర్గానికే పరిమితమని అనుకుంటే, అది వారి ఖర్మ. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గంలో జన్మించినా, అన్ని సామాజిక వర్గాల ప్రతినిథిగా ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. అది ముద్రగడకీ, చేగొండికీ తెలియదని ఎలా అనుకోగలం.?
కమ్మ సామాజిక వర్గం టీడీపీని డిక్టేట్ చేయగలదా.? రెడ్డి సామాజిక వర్గం వైసీపీని డిక్టేట్ చేయగలదా.? కమ్మ సామాజిక వర్గం టీడీపీకి అండగా వుంటుంది. రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి అండగా వుంటుంది. అంతా కాదు, మెజార్టీ.! అలాగే, కాపు సామాజిక వర్గం, జనసేనకు అండగా వుండాలి.. కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలనుకుంటే.!
ఇవన్నీ మానేసి, ‘పవన్ కళ్యాణ్ మా ఇంటికి రాలేదు.. పవన్ కళ్యాణ్ పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకోలేదు..’ లాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయడం ముద్రగడ పద్మనాభం లాంటోళ్ళకి తగదు. అలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు తమ స్థాయిని మరింత దిగజార్చేసుకుంటారంతే.
వైఎస్ జగన్ ఏమైనా, ముద్రగడ ఇంటికి వెళ్ళారా.? లేదు కదా.! ఏదిఏమైనా, ముద్రగడ వైసీపీలో చేరడం, జనసేన మీద ముద్రగడ విమర్శలు చేస్తుండడం.. ఇదంతా కాపు సామాజిక వర్గాన్ని జనసేనకు మరింత దగ్గర చేసేలా వుంది తప్ప, జనసేనకు ఆయన వల్ల వచ్చే అదనపు నష్టం ఏమీ లేదు.