ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడంటే తుపాను నుంచి సునామీ హెచ్చరికలు తెలిపే టెక్నాలజీ వచ్చింది కానీ.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకూ ఇటువంటి సూచనలు, ముందు జాగ్రత్త చర్యలు చెప్పే వ్యవస్థ లేదు. అందుకే విపత్తల నష్టం ఇప్పటికంటే అంచనాకు మించి ఉండేది. గతంలో ఇటువంటి సమయాల్లో ప్రభుత్వాలు మాత్రమే సాయం అందించేవి. ప్రజలు బాగా కనెక్ట్ అయ్యే చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు మహా అయితే పిలుపునిచ్చి చందాలు వసూలు చేసేవారు. అయితే.. 80వ దశకంలో చిరంజీవి ఈ పంథాను పూర్తిగా మార్చేశారు. తానే స్వయంగా ఆర్ధికసాయం ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచేవారు. దీంతో అభిమానులు కూడా చిరంజీవి బాటలో విరాళాలు సేకరించి ఆపన్నులకు అండగా నిలిచేవారు. అలా జరిగిన వాటిలో..
గోదావరి జిల్లాల్లో..
1986 సమయంలో గోదావరి జిల్లాలను తీవ్ర తుపాను కుదిపేసింది. వరదలతో రెండు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో సామాన్య కుటుంబం నుంచి స్వశక్తితో ఎదుగుతున్న చిరంజీవి తుపాను ప్రభావిత గోదావరి జిల్లా ప్రజల కష్టాన్ని చూసి చలించిపోయారు. దీంతో గోదావరి వరద బాధితులకు ఆరోజుల్లోనే రూ.2,00,000/- (రెండు లక్షలు) ఆర్ధిక సాయం ప్రకటించి బాధితులకు అందజేశారు. 5, 10పైసలు కూడా చెల్లుబాటు అయ్యే ఆరోజుల్లో 2లక్షల సాయం అంటే ఈరోజుల్లో లెక్కేస్తే ప్రతిఒక్కరూ విస్తుపోయే మొత్తం అది. లారీల్లో బియ్యం, మహిళలకు చీరలు, పిల్లలకు పాల డబ్బాలతోపాటు ఓ డాక్టర్ బృందాన్ని కూడా పంపించారు. ఇదంతా చిరంజీవి అందించిన మొత్తానికి అదనంగా చిరంజీవి చేసిన సాయం. అప్పటినుంచీ ఇలాంటి విపత్తుల సమయంలో తొలిగా చిరంజీవే స్పందిస్తూ ఆర్ధికసాయం అందించి ఆదర్శమయ్యారు.
మదనపల్లిలో..
మరో విపత్తు సమయంలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లి కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. అప్పట్లో చెన్నైలో ఉండే చిరంజీవి వెంటనే ఈ విపత్తు సమయంలో స్పందించారు. భారీ ఆర్ధికసాయం చేయడమే కాకుండా లారీల్లో చెన్నై నుంచి బియ్యం, నిత్యావసరాలు, పాలు పంపించారు. విపత్తులో ఆస్తి నష్టం జరిగిన కుటుంబాల్లో చిరంజీవి చేసిన ఆర్ధికసాయం వెలుగుదివ్వే అయింది. చిరంజీవిలో ఉన్న మరో సుగుణం.. ఆయన ఆర్ధికసాయం చేయడమే కాకుండా.. విరాళాలు ఇవ్వాలని హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు పిలుపునిచ్చి వారిలో స్ఫూర్తి నింపుతారు. వారంతా చిరంజీవి ఇచ్చిన పిలుపును విజ్ఞప్తిలా కాకుండా ఆదేశంలా పాటిస్తారు. తనను ఆదరించిన ప్రజల కష్టసుఖాల్లో భాగమైన తొలి హీరోగా నిలిచారు. ఇదే చిరంజీవికి శ్రీరామరక్ష అయింది.