నేటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి. ప్రధాన మంత్రి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం కాస్సేపటి క్రితం, లోక్ సభ ఎన్నికలతోపాటు, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.
మే 13న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతోపాటు, లోక్ సభకీ పోలింగ్ జరగబోతోంది. అంటే, ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలకు దాదాపు రెండు నెలల సమయం దొరికిందన్నమాట. నిజానికి, వచ్చే నెలలోనే పోలింగ్ వుండబోతోందంటూ ప్రచారం జరిగింది.
కానీ, చిత్రంగా మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. మొత్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ేప్రిల్ 19 నుంచి జరుగుతుంది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్తోపాటుగా ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటితోపాటే, లోక్ సభ ఎన్నికలూ జరుగుతాయి.
ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదలవుతుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. నామినేషన్ల గడువు ఏప్రిల్ 25న, నామిననేషన్ల పరిశీలన ఏప్రిల్ 26, ఉప సంహరణ 29 ఏప్రిల్ అని ఎన్నికల సంఘం పేర్కొంది.
పోలింగ్ మే 13 సంగతెలా వున్నా, కౌంటింగ్ జూన్ 4 అంటేనే, చాలామందికి చాలా అనుమానాలు వచ్చేస్తున్నాయి. పోలింగుకీ, కౌంటింగుకీ మధ్య వున్న ఆ గ్యాప్.. చాలా చాలా లొసుగులకు ఆస్కారముండొచ్చన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇదిలా వుంటే, ఈ రోజే ఏపీలోని దాదాపు అన్ని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల లిస్టుని అధికార వైసీపీ ప్రకటించింది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి తరఫున కూడా మెజార్టీ అభ్యర్థుల ప్రకటన ఇప్పటికే జరిగిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.