Tamilnadu: వీల్ చైర్ క్రికెట్లో ప్రపంచ కప్ సాధించానని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను బురిడీ కొట్టించాడో ఘనుడు. విస్మయానికి గురిచేసిన ఈ ఘటన తమిళనాడు (Tamilnadu) లో జరిగింది. రామనాధపురం జిల్లా కడలాడి తాలూకా కీళచెల్వనూర్ కు చెందిన వినోద్ బాబు దివ్యాంగుడు. ఆరేళ్ల నుంచి తాను క్రికెట్ ఆడుతున్నానని వీల్ చైర్ క్రికెట్-2022లో తన కెప్టెన్సీలోని జట్టు ఆసియా కప్, గత వారం లండన్ లో టీ-20 ప్రపంచ కప్ గెలిచామని ఓ కప్పుతో ఏకంగా సీఎం స్టాలిన్ (Stalin), మంత్రులు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin), రాజకన్నప్పన్ ను కలిశాడు.
ఇవన్నీ అబద్దాలని వచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ చేపట్టిన దర్యాప్తులో వినోద్ బాబు మోసాలు బయటపడ్డాయి. అతను జట్టులోనే లేడని, పాస్ పోర్టు కూడా లేదని.. మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తాడని తేలింది. ఓ బేకరీ యజమాని లక్ష రూపాయలతోపాటు పలువురు మంత్రులు కూడా ఆర్ధికసాయం చేసినట్టు గుర్తించారు. తనకు ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిన వినోద్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.