సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ లెవెల్లో చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెల్సిందే. గత 120 గంటల నుండి టీజర్ యూట్యూబ్ లో టాప్ లోనే ట్రెండ్ అవుతోంది.
ఇది పక్కనపెడితే, సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. విజయశాంతి ఇంటి సెట్ లో కొన్ని కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ కూడా పాల్గొంటున్నాడు. ఇక నుండి ప్రతి సోమవారం సరిలేరు నీకెవ్వరుకి సంబంధించిన అప్డేట్ వస్తుందని టీమ్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇది మహేష్ బాబు అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. మరి కొద్ది రోజుల్లో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉండనున్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు భారీ ఎత్తున విడుదల కానుంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.
