రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం.! కోడి కత్తి శీనుకి బెయిల్ వచ్చిందహో.! 2019 ఎన్నికలకు ముందర అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కోడి కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరావు అలియాస్ కోడి కత్తి శీనుకి, 2024 ఎన్నికలకు ముందర బెయిల్ వచ్చింది.
‘ఈ కేసులో దోషిగా తేలి శిక్ష పడినా, మూడు నాలుగేళ్ళకు మించి శిక్ష పడే అవకాశం లేదు. కానీ, నిందితుడిగా ఐదేళ్ళ శిక్ష పూర్తి చేసేసుకున్నాడు..’ అంటూ కోడి కత్తి శీను తరఫు న్యాయవాది, కోడి కత్తి శీను బంధువులు పదే పదే వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కోడి కత్తితో దాడి చేశాడన్నది ‘శీను’పై అభియోగం. అప్పటినుంచి ‘కోడి కత్తి శీను’గా పేరొందాడు. అప్పుడే అతన్ని సంఘటనా స్థలంలోనే అరెస్టు చేశారు పోలీసులు. అప్పటినుంచి ఇప్పటిదాకా జైల్లోనే వున్నాడు కోడి కత్తి శీను.
ఆ మధ్య కోడి కత్తి శీనుపై జైల్లోనే హత్యాయత్నం జరగొచ్చంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆమరణ నిరాహార దీక్షకి కూడా దిగారు. ఎలాగైతేనేం, కోడి కత్తి శీనుకి బెయిలొచ్చింది. అయితే, ఎన్నికలకు ముందర కోడి కత్తి శీను బెయిల్ మీద విడుదలవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘కోడి కత్తి పార్ట్ టూ’ ఏదైనా ప్లాన్ చేస్తారా.? అంటూ సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వుండే విమానాశ్రయంలో, ప్రతిపక్ష నేత మీద ఓ సామాన్యుడు, కోడి కత్తితో దాడి చేయడం సాధ్యమయ్యే విషయమేనా.? ఛాన్సే లేదంటారు చాలామంది.
ఏమో, నిజమేంటో ఆ పైవాడికే ఎరుక.! కోడి కత్తి కేసులో, ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై బాధితుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు సాక్ష్యం ఇవ్వలేకపోయారన్నది ఇప్పటికీ ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్.!