తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో రూ.69 వేల కోట్ల వ్యయంతో నగరం నలువైపులా మెట్రోని విస్తరించాలని నిర్ణయించారు. మూడో దశ విస్తరణలో భాగంగా 278 కిలోమీటర్ల పొడవున కొత్తగా 8 మార్గాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించనున్నారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండటంతో వాటిని నియంత్రించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్తగా నగరంలోకి ఫార్మాసిటీ రానుండటంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి జల్పల్లి, తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు మెట్రోను విస్తరించనున్నారు.
మంత్రిమండలి సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..’ హైదరాబాద్ మహానగరం తెలంగాణకు గుండెకాయ లాంటిది. దేశంలో వేగంగా డెవలప్ అవుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రభాగాన ఉంది. సిటీ ఎంత పెరిగినా, ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎంతమంది ప్రజలు సిటీలోకి వచ్చినా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని హంగులతో దీన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతాం. వచ్చే నాలుగేళ్లలో రూ.69 వేల కోట్లతో మెట్రోని మరింతగా విస్తరిస్తాం. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆశిస్తున్నాం. కేంద్రం సాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని పూర్తి చేస్తుంది’ అని తెలిపారు.
ప్రతిపాదనలో ఉన్న కొత్త రూట్లు ఇవే..
హైదరాబాద్ లో ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేశారు. దీనికి అదనంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. కొత్తగా జూబ్లీ బస్టాండ్ నుంచి తూకుంట వరకు డబుల్ డెక్కర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దానిపై ఒక అంచె లో వాహనాలు, మరో అంచెలో మెట్రో రైలు రాకపోకలు సాగిస్తాయి. ప్యాట్ని సెంటర్ నుంచి కండ్లకోయ వరకు మరో డబుల్ డెక్కర్ నిర్మాణాన్ని చేపడతారు. ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు అక్కడ నుంచి లక్డికాపూల్ వరకు, విజయవాడ మార్గంలో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ మీదుగా పెద్ద అంబర్ పేట వరకు మెట్రో సేవలు విస్తరించనున్నారు. ఇక ఉప్పల్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ వరకు విస్తరణ జరగనుంది.
శంషాబాద్ నుంచి మెట్రో విస్తరించే ప్రతిపాదనలో భాగంగా కొత్తూరు షాద్ నగర్ మధ్య మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు వరకు మెట్రో నిర్మాణాన్ని చేపట్టడంతోపాటు ఓల్డ్ సిటీలోని మెట్రో మార్గాన్ని పూర్తి చేయనున్నారు.