Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల పరస్పర సవాళ్లతో ఒకసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై అధికార వైసీపీ నాయకులు కర్రలతో, రాళ్లతో దాడి చేయడంతో అక్కడ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో స్థానిక ఆర్టీసి బస్టాండ్ సెంటర్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వివరాల్లోకెళ్తే…
తెలుగుదేశం పార్టీ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆర్టీసీ బస్టాండు ప్రాంతం వద్దకు రాగానే అక్కడ వారికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎదురయ్యారు. మట్టి తవ్వకాలపై తెలుగుదేశం చేసిన ఆరోపణల పై చర్చకు సిద్ధమంటూ ఆయన వారికి సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అక్రమంగా గనులు తవ్వుతున్నారని టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు టిడిపి కార్యకర్తలను అడ్డుకుని అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు. టిడిపి కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టి వాటిని శాంతియుతంగా ప్రశ్నిస్తుంటే దాడి చేయిస్తారా? అని టిడిపి కార్యకర్తలు నిలదీశారు.