వైనాట్ 175 కాదు, 90 సీట్లు గెలిస్తే చాలు.. అధికారం నిలబెట్టుకోగలుగుతాం. ఆ తర్వాత ఎటూ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించగలిగితే, ఇంకో ఐదేళ్ళపాటు అధికారానికి ఢోకా వుండదు.!
వైసీపీలో ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఇది.! వైసీపీ గ్రాఫ్ ఎప్పుడో పడిపోయింది. అధికారంలో వుండటంతో అలా అలా దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చారంతే. బెదిరింపులకు పాల్పడి, బుజ్జగింపులకు దిగి.. చాలా చేసి, పార్టీ నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ప్రజా ప్రతినిథుల్ని కాపాడుకున్నారు వైఎస్ జగన్.
కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలామంది ప్రజా ప్రతినిథులు సంక్రాంతిని ముహూర్తంగా పెట్టుకున్నారు. సంక్రాంతి తర్వాత, గేట్లు బద్దలుగొట్టుకుని వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి నేతలు దూకెయ్యడం ఖాయంగానే కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీని వీడటంతోనే, వైసీపీలోని డొల్లతనం బయటపడిపోయింది. మేకపోతు గాంభీర్యం ఇక చెల్లదు. పూర్తిగా వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
అందుకే, ఎలాగోలా 90 సీట్లలో నెగ్గితే చాలు.. అనుకుంటోందిట ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం. అవసరమైతే బీజేపీతోనో, కాంగ్రెస్ పార్టీతోనో పొత్తు పెట్టుకోవడానికైనా సిద్ధమేనంటూ సంకేతాలు పంపుతోందిట. ఈ విషయమై హైద్రాబాద్లో తన దత్త తండ్రి కేసీయార్తో వైఎస్ జగన్ ‘పరామర్శ’ పేరుతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
బీజేపీ మళ్ళీ వస్తుందా.? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముందా.? అన్న అంశాలపై జగన్, కేసీయార్ సలహా తీసుకుంటున్నారట. సర్వేల్ని నమ్మి మోసపోయిన బీఆర్ఎస్ అధినేత కేసీయార్, ఏపీలో వైసీపీ చేయించుకుంటున్న పెయిడ్ సర్వేలు, వైసీపీ కొంప ముంచేశాయని జగన్కి స్పష్టంగా చెప్పారని తెలుస్తోంది.