టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా, టిక్కెట్లు దొరక్క అలకపాన్పు ఎక్కేవారి విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడే బాధ్యత తీసుకోనున్నారట స్వయంగా.! ఈ విషయమై డ్యామేజ్ కంట్రోల్ చర్యలు కావొచ్చు, ట్రబుల్ షూటింగ్ వ్యవహారాలు కావొచ్చు.. అన్నీ చంద్రబాబు కేంద్రంగానే జరగనున్నాయట.
జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఎందుకంటే, టిక్కెట్లు ఆశపడి భంగపడి, పార్టీని వీడే ఆలోచన జనసేన ఆశావహులెవరూ చేయకపోవచ్చు. ఈ దిశగా జనసేనాని ఇప్పటికే పలు సందర్భాల్లో పార్టీ ముఖ్య నేతలందర్నీ పిలిచి మాట్లాడటం చూశాం.
ఏయే నియోజకవర్గాల్ని జనసేన ఆశిస్తోందో, ఏయే చోట్ల జనసేన బలంగా వుందో.. ఇప్పటికే జనసేనాని, సంబంధిత సమాచారాన్ని పార్టీ ముఖ్య నేతల నుంచి సేకరించి, మిత్రపక్షం టీడీపీకి అందించేశారు. చంద్రబాబు కూడా, ఆ నియోజకవర్గాల విషయమై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడంలేదు.
జనసేనతో పొత్తు టీడీపీకి ఎంత అవసరమో చంద్రబాబుకి బాగా తెలుసు. అయితే, టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం పెరిగాక, ఆశావహులు సహజంగానే ఒకింత ఎక్కువ ఆశపడతారు. అక్కడే అసలు సమస్య వస్తుంది.
కాగా, బీజేపీ కూడా పొత్తులోకి రానున్న దరిమిలా, వారికి కేటాయించే సీట్ల విషయమై చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు. జనసేన విషయమై స్పష్టత వున్నా, బీజేపీకి కేటాయించాల్సిన సీట్లు చంద్రబాబుకి కత్తి మీద సాములాంటి వ్యవహారమే.
అందుకే, ‘తప్పదు.. త్యాగాలు చేయాల్సిందే..’ అని పార్టీ ముఖ్య నేతలకు చంద్రబాబు చెబుతున్నారు. ఒకరిద్దరు సీనియర్లు గుస్సా అవుతున్నా, ‘జనసేన మీద ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శలు చేయొద్దు..’ అని చంద్రబాబు హుకుం జారీ చేశారట.