తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెల్సిందే. సిట్టింగ్ ఎంపీ (వైసీపీ) హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక తప్పనిసరైంది. తెలంగాణలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగితే అక్కడెలా విజయం సాధించామో, అదే ఫార్ములాతో తిరుపతిలో కూడా గెలుస్తామని బీజేపీ చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో మిత్రపక్షం జనసేనని కూడా నీరుగార్చే ప్రయత్నాలు చేసింది బీజేపీ.
దుబ్బాకలో లెక్కలు వేరు.. తిరుపతిలో లెక్కలు వేరు. తెలంగాణలో బీజేపీకి కాస్తో కూస్తో ఓటు బ్యాంకు వుంది. ఏపీలో బీజేపీకి ఆ పరిస్థితి లేదు. బీజేపీ కంటే జనసేన మెరుగైన స్థితిలో వుంది జనసేన. అయినాగానీ, తిరుపతి విషయమై బీజేపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, జనసేన క్యాడర్ని డైలమాలో పడేసింది.
ఇక, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మొత్తం 50 డివిజన్లలో 21 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. దాంతో మిగిలిన 29 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగాల్సి వుంది. వీటిల్లో బీజేపీ 8 చోట్ల పోటీ చేస్తోంటే, జనసేన కేవలం 3 చోట్లకే పోటీ పరంగా పరిమితమయ్యింది. ఇదొక్కటి చాలు, తిరుపతిలో బీజేపీ రాజకీయం ఎంత దారుణంగా దెబ్బతినేసిందో చెప్పడానికి.
ఎప్పడో ఏడాది క్రితం నామినేషన్ల వ్యవహారం నడిచింది కాబట్టి.. అనేది కేవలం కుంటిసాకు మాత్రమే అవుతుంది. పైగా, తిరుపతిలో బీజేపీ తన ఉనికిని చాటుకునేందుకు పడుతున్న కష్టం కూడా ఏమీ లేదు. కింది స్థాయిలో కొన్ని చోట్ల బీజేపీకి జనసైనికులే కాస్తో కూస్తో ఊతమిస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలకీ, లోక్సభ ఉప ఎన్నికకీ లింకు పెట్టడం సబబు కాకపోవచ్చు. కానీ, కాస్తో కూస్తో ఈ ప్రభావం ఖచ్చితంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై పడి తీరుతుంది.
మిత్రపక్షం జనసేనను పూర్తిస్థాయిలో కలుపుకుపోతేనే బీజేపీ కాస్తో కూస్తో రాష్ట్రంలో నిలదొక్కుకోగలుగుతుంది. కానీ, తన చెత్త వ్యూహాలతో మిత్రపక్షం జనసేనను బలహీనం చేసి, తానూ బలహీనపడిపోయి.. కమలదండు ఏం రాజకీయం చేయాలనుకుంటోందో ఆంధ్రపదేశ్లో.. అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు.
‘మీకు రాష్ట్రంలో అధికారం వుంటే.. మాకు దేశంలో అధికారం వుంది..’ అని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నంత కాన్ఫిడెంట్గా ఏపీ బీజేపీ నేతలు ఏపీలో అధికార పార్టీని హెచ్చరించలేకపోతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తున్న అంశం.