‘నాలుగు వేల కోట్లకు ఆశపడి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను అమర్చడం ద్వారా రైతుల గొంతు కోస్తోంది..’ అంటూ తెలంగాణ మంత్రి హరీష్రావు సంచలన విమర్శలు చేసిన విషయం విదితమే. అయితే, ఈ విమర్శలపై కాస్త లేటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్పందన వచ్చింది. ‘4 వేల కోట్లు మా జేబుల్లో వేసుకోవడానికి కాదు, అవి ప్రజల కోసం ఖర్చు చేస్తాం.. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కొనసాగుతుంది.. అయితే, దాని పద్ధతి మాత్రమే మారుతుంది. వ్యవసాయ విద్యుత్ ఇంకో 30 ఏళ్ళు ఉచితంగానే వుంటుంది..’ అంటూ ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగా, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను అమర్చాల్సి వుంటుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘సై’ అనేయగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. కొత్త విద్యుత్ విధానం ద్వారా రైతులకు నష్టం జరుగుతుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతోంది.
ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం నగదు బదిలీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఉచిత వ్యవసాయ విద్యుత్ విధానాన్ని అటకెక్కించినప్పటికీ.. ముందు ముందు రైతుల మీద భారం తప్పదన్నది సర్వత్రా విన్పిస్తోన్న అభిప్రాయం. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను అమరిస్తే, తెలంగాణకు 2,500 కోట్లు అలాగే ఆంధ్రప్రదేశ్కి 4 వేల కోట్లు అప్పు దొరికేందుకు వీలుగా కేంద్రం వెసులుబాట్లు కల్పించిన విషయం విదితమే.
దీనిపై అసెంబ్లీ సాక్షిగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయాలనుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం, ‘కేంద్రంతో సఖ్యత’ అంటూ, రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తోందన్న విమర్శలున్నాయి.
544384 494605Hey mate, .This was an exceptional post for such a hard topic to talk about. I look forward to seeing many far more excellent posts like this 1. Thanks 923321