వైసీపీ అనుకూల మీడియా వుండగా, టీడీపీ అనుకూల మీడియాకి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో జరిగే ‘అంశాలు’ ముందుగా లీకుల రూపంలో అందుతున్నాయట. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గుస్సా అవుతున్నారట. అంతేనా, ఓ మంత్రిగారికి ముఖ్యమంత్రి వార్నింగ్ కూడా ఇచ్చేశారట ఈ విషయమై. మిగతా మంత్రుల్ని కూడా సున్నితంగా హెచ్చరించారట. అలాగని, ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.
నిజానికి, ‘మీడియాకి లీకులు అందడం’ అనేది కొత్త విషయమేమీ కాదు. అయితే, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరు. టీడీపీ హయాంలో.. ఎలాంటి లీకు అయినా తొలుత ‘ఎల్లో మీడియా’కే అందేవి. ఇప్పుడు ‘బ్లూ మీడియాకి’ లీకులు అందితే అందొచ్చుగాక.! పొద్దున్న లేస్తే.. వైసీపీని తూలనాడటం తప్ప ఇంకో పని లేని ఎల్లో మీడియా, క్యాబినెట్లో జరిగే విషయాలపై మొట్టమొదటిగా లీకులు పొందడమంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.
పైగా, ముఖ్యమంత్రికే ఈ విషయం తెలిసిపోయి.. మంత్రుల్ని హెచ్చరించారట.. క్యాబినెట్ సమావేశం సాక్షిగా. అంటే, వైసీపీలో ‘ఎల్లో బ్యాచ్’కి చెందిన ఎవరో ‘కోవర్టులుగా’ పనిచేస్తున్నారని అనుకోవాలన్నమాట. ఇదొక పొలిటికల్ ఎత్తుగడ. ఇలాంటి ఎత్తుగడలతోనే ఎల్లో మీడియా, టీడీపీని సర్వనాశనం చేసేసిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ బలంగా విన్పిస్తుంటుంది.
అదే గేమ్ ప్లాన్ని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనూ అమలు చేయాలని టీడీపీ అనుకూల మీడియా భావిస్తోందా.? లేదంటే, నిజంగానే క్యాబినెట్ సమావేశం నుంచి తొలుత లీకులన్నీ ఎల్లో మీడియాకే అందుతున్నాయా.? ఈ విషయమై అధికార వైసీపీ స్పందించాలి. కాదు కాదు.. ప్రభుత్వ పెద్దలే స్పందించాలేమో.. ఎందుకంటే, ఇది క్యాబినెట్కి సంబంధించిన వ్యవహారం.
క్యాబినెట్ మీటింగ్లో ఏం జరుగుతుందో అధికారులకు, మంత్రులకు మాత్రమే తెలిసే అవకాశం వుంటుంది. సంబంధిత మంత్రి, ఆ వివరాల్ని ఆ తర్వాత వెల్లడిస్తారు. చూచాయిగా కొన్ని అంశాలు మీడియాకి (అన్ని ఛానళ్ళకూ) చేరుతుంటాయి, సదరు మంత్రిగారు వెల్లడించక ముందే. కానీ, ‘అక్షరం పొల్లు పోకుండా అందరికన్నా ముందే ఓ మీడియా సంస్థకు చేరడం’ అన్నది చిన్న విషయమేమీ కాదు.