వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో జాబితా బయటకు వచ్చింది 2024 ఎన్నికలకు సంబంధించి. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు, ప్రమోషన్ లభించింది. ఆయన వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు కిలారు వెంకట రోశయ్యను గుంటూరు లోక్ సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా వుంటే, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అవకాశం దక్కించుకున్నారు అంబటి మురళీ కృష్ణ. గడచిన ఏడాది కాలంగా అంబటి మురళీ కృష్ణ, జగన్నామ సంక్షేమ సంగమం పేరుతో పొన్నూరు నియోజకవర్గం పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
వృద్ధులు, మహిళలు, యువతకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కళ్ళ జోళ్ళ పంపిణీ, హృద్రోగ పరీక్షలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. యాంజియోగ్రామ్ చేయించడం, స్టంట్లు వేయించడం, గుండె సంబంధిత ఇతర శస్త్ర చికిత్సలు చేయడం వంటి సేవా కార్యక్రమాలతో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకన్నారు అంబటి మురళీ కృష్ణ.
సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా అంబటి మురళీ కృష్ణ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఏడాది కాలంలోనే సుమారుగా 61 వైద్య శిబిరాలు నిర్వహించారు. మొత్తంగా 105 వరకు సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు. దివ్యాంగ దర్శిని పేరుతో కాళ్ళు చేతులు కోల్పోయిన దివ్యాంగులకు కృత్రిమ అవయవాల్ని అందిస్తూ వచ్చారు.
వీటితోపాటుగా, ఇంటింటికీ వెళ్ళి, వైసీపీ చేపడుతూ వస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించడం ద్వారా వైసీపీ శ్రేణుల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ప్రశంసలు అందుకున్నారు.
పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న అంబటి మురళీకృష్ణకు ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న దరిమిలా, ఆయన్నే పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
గుంటూరులో కాపు హాస్టల్ నిర్మాణంలోనూ భాగం పంచుకున్న అంబటి మురళీకృష్ణకి, కాపు సామాజిక వర్గంలోనూ మంచి గుర్తింపు లభించింది.
సీఎం జగన్ మోహన్ రెడ్డితో తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాననీ, తనకు పార్టీ అధినాయకత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందాయనీ, ఇప్పుడు తనకు పొన్నూరు అసెంబ్లీ సమన్వయకర్తగా అవకాశం లభించడం తనకు ఆనందంగా వుందనీ అంబటి మురళీకృష్ణ చెప్పుకొచ్చారు.
నియోజకవర్గంలో వైసీపీ గెలుపుకు కృషి చేస్తానని చెప్పారు అంబటి మురళీ కృష్ణ.