తెలంగాణలో ఈ ఏడాది ఆఖరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా పార్టీలు ఇప్పటికే ఎన్నికల కసరత్తు ను మొదలు పెట్టేశాయి. ఇందులో భాగంగా ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. అయితే ఈసారి ఎప్పుడూ లేని విధంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఆ సీటు కోసం అధికార భారతీయ రాష్ట్ర సమితి పార్టీలోనే పోటీ పెరుగుతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నేత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈసారి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన చాలా రోజుల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేసేవారు. అయితే ఈసారి ఆయన తన సొంత నియోజకవర్గం నాగార్జునసాగర్ పై దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో ఆయన నిర్మించిన కన్వెన్షన్ హాల్ ఓపెనింగ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి తన అల్లుడు అల్లు అర్జున్ (Allu Arjun) ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. ఈ కార్యక్రమం వేదికగా చంద్రశేఖర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడారు.
అధిష్ఠానం తనకి నాగార్జునసాగర్ నియోజకవర్గ టికెట్ కేటాయిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో తన అల్లుడు అల్లు అర్జున్ కూడా పార్టీ తరఫున తనకు మద్దతుగా ప్రచారం చేస్తారని ప్రకటించారు. దీంతోపాటు తనకి మెగా ఫ్యామిలీ మొత్తం అండగా ఉందని తెలిపారు. వారందరి మద్దతుతో తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలను పురస్కరించుకొని బీఆర్ఎస్ జాబితాని రెడీ చేస్తున్న సమయంలో చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.