సినీనటి, మాజీ ఎంపీ జయప్రద( Jaya Prada) కి చెన్నై కోర్టు షాక్ ఇచ్చింది. తన థియేటర్లో పనిచేస్తున్న కార్మికుల ఈఎస్ఐ నిధుల వాటాని చెల్లించనందుకుగాను ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఎగ్మోర్ కోర్టు తీర్పునిచ్చింది. చెన్నై కి చెందిన రామ్ కుమార్, రాజా బాబు లతో కలిసి ఆమె అన్నా రోడ్డు ప్రాంతంలో ‘జయప్రద థియేటర్ కాంప్లెక్స్’ ని నిర్వహించారు. ఈ థియేటర్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ వాటాన్ని చెల్లించడం లేదంటూ కొందరు ఉద్యోగులు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ని ఆశ్రయించారు.
దీంతో లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. జయప్రద పై చెన్నైలోని ఎగ్మోర్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం జయప్రద తో పాటు ఆమె పార్ట్నర్స్ ఇద్దరికీ ఆరు నెలల జై శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించింది. గతంలోనూ ఈ థియేటర్ రూ. 20 లక్షల టాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినందుకుగాను సివిల్ కోర్ట్ ఆదేశాల మేరకు థియేటర్లోని ఫర్నిచర్ ని సీజ్ చేశారు.
తెలుగు ప్రజలకు జయప్రద సుపరిచితులే. 80ల్లో అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోనూ జయప్రద నటించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు హీరోయిన్ గా కొనసాగారు. తర్వాత రాజకీయాలపై మక్కువతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.